Breaking News

యుద్ధ కళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు

-3 దశాబ్దాల కఠోర సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగెన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ దక్కడంపై మంత్రి దుర్గేష్ హర్షం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ (యుద్ధ కళలు) రంగంలో అత్యంత అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చూపిన క్రమశిక్షణ, సాధన, పరిశోధన, అంకితభావానికి నిదర్శనంగా జపాన్ కు చెందిన గోల్డెన్ డ్రాగెన్ సంస్థ ద్వారా టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు దక్కడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు.సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక మక్కువ పెంచుకున్నారని, చెన్నైలో కరాటే,వివిధ యుద్ధ కళలపై ఆయన చేసిన కఠోర సాధన నేడు ఈ అరుదైన ఘనతకు పునాది వేసిందని వివరించారు. పురాతన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రవేశం పొందడం విశేషమని, తమ్ముడు, ఖుషి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అన్నరం, ఇటీవల విడుదలైన ఓజీ చిత్రాల్లో ఈ తరహా కళలను ప్రదర్శించారని గుర్తుచేశారు. ప్రపంచస్థాయిలో అత్యంత క్లిష్టమైనదిగా భావించే ఈ విద్యలో ఆయన సాధించిన ప్రగతి గర్వకారణమన్నారు. మూడు దశాబ్దాల పాటు ఒక విద్య పట్ల నిలకడగా, అంకితభావంతో సాధన చేయడం ఆయనలోని పట్టుదలకు, క్రమశిక్షణకు నిదర్శనమని మంత్రి దుర్గేష్ కొనియాడారు.రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ బిజీగా ఉంటూనే తనకిష్టమైన యుద్ధ కళల్లో నిరంతరం సాధన చేస్తూ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమని, యువతకు ఆయనో గొప్ప స్ఫూర్తి ప్రదాత అని తెలిపారు. ఓ వైపు సినిమా రంగంలో, శాస్త్రీయ యుద్ధకళల్లో, యుద్ధ తత్వ శాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగల అతికొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *