-ఐహెచ్ఐపి (IHIP) వెబ్ లింక్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
-క్షణాల్లో అంచెలంచెలుగా అధికారులకు సమాచారం
-రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అంటు వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, తక్షణ చర్యలు తెసుకోవడంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది . ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ‘డిసీజ్ సర్వైలెన్స్’ ప్రోగ్రామ్ కింద రూపొందించిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫామ్ (IHIP) వెబ్ లింక్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు, స్వీకరిస్తామని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ తెలిపారు.
పరిసరాల అపరిశుభ్రత, మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, తాగునీటి కలుషితమవడం వంటి కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మూకుమ్మడిగా వీరేచనాలు, వాంతులు వంటి అంటువ్యాధుల బారినపడుతున్నారు. ఈ తరహా ఘటనలు పలు సందర్భాల్లో క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో పైస్థాయి అధికారులకు చేరడంలో జాప్యం జరుగుతోంది. దీనిని అధిగమించే చర్యల్లో బాగంగా ప్రభుత్వం వ్యాదుల నియంత్రణలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయాలని నిర్ణయించినట్లు వీరపాండియన్ వెల్లడించారు.
వెబ్ లింక్ (https://ihip.mohfw.gov.in/cbs/#/?campaign_id=202511) ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు తమ ప్రాంతాల్లో ప్రబలుతున్న వ్యాధులు, వ్యాధుల ఉద్ధృతి (Disease Outbreaks) గురించిన వివరాల నమోదుకు అవకాశాన్ని కల్పించారు . స్క్రీన్పై కనిపించే ఎంట్రీ ఫీల్డ్స్లో అవసరమైన సమాచారం నింపడంతో పాటు, సంబంధిత ఫోటోలను అప్లోడ్ చేసే సౌకర్యాన్ని కూడా ఇందులో కల్పించారు.
ప్రజలు నమోదు చేసిన సమాచారం క్షణాల్లోనే ఏఎన్ఎం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులకు చేరుతుందని కమీషనర్ వివరించారు. ఈ అలర్ట్ల ఆధారంగా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అప్రమత్తమై వెంటనే అవసరమైన చర్యలు చేపడతారని పేర్కొన్నారు. ఈ కొత్త అవకాశం ద్వారా ప్రజలు అంటువ్యాధుల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News