-పంచాయతీల్లో వారం రోజుల్లో గుర్తింపు –నోటీసులు జారీ
-రుడా చైర్ పర్సన్ బొడ్డు వెంకట రమణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
RUDA చైర్పర్సన్ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆధ్వర్యంలో, వైస్చైర్పర్సన్ వై. మేఘ స్వరూప్, ఐఏఎస్ సూచనల మేరకు గురువారం రుడా కాన్ఫరెన్స్ హాల్లో RUDA పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS), బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (BPS) అమలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికార లేఅవుట్లు, కట్టడాలపై అమలులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనధికార లేఅవుట్ల వల్ల ప్రజలకు, సమాజానికి కలిగే నష్టాలు, డెవలప్మెంట్ ఛార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయం, తద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏర్పడుతున్న అడ్డంకులపై చైర్పర్సన్ వివరించారు. రాబోయే వారం రోజుల్లో ప్రతి పంచాయతీ పరిధిలోని అన్ని అనధికార లేఅవుట్లను గుర్తించి, ఏపీ ఎంఆర్యుడిఏ చట్టం–89 ప్రకారం ప్రొవిజనల్ ఆర్డర్, కన్ఫర్మేషన్ ఆర్డర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. సరిహద్దు రాళ్లు తొలగించడం, అనధికార రోడ్లను తొలగించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులు మరియు ముఖ్య ప్రదేశాల్లో అనధికార లేఅవుట్ వివరాలు ప్రదర్శించడం వంటి చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. అమలు తీరును ప్రత్యేక బృందాలతో తనిఖీ చేసి, నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేశారు. లేఅవుట్ డెవలపర్లు, ప్రజలకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో చేపట్టిన చర్యలపై వివరాలు వెల్లడించారు. RUDA చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జివిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ఇప్పటికే గుర్తించిన అనధికార లేఅవుట్ల వివరాలు తెలియజేస్తూ తదుపరి కార్యాచరణ ప్రణాళికను వివరించారు. సర్వే నెంబర్ల FMBలు, అడంగల్ కాపీలు, రఫ్ స్కెచ్లు, రిజిస్టర్డ్ సేల్ డీడ్లు సమర్పించి RUDA కార్యాలయం ద్వారా రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చని తెలిపారు. అనధికార లేఅవుట్లలోని రోడ్లను స్వాధీనం చేసుకోరాదని, అక్కడ భవన నిర్మాణ అనుమతులు ఇవ్వరాదని స్పష్టం చేశారు. RUDA ప్లానింగ్ ఆఫీసర్ నార్కెడిమిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, బిల్డింగ్ ప్లాన్ రిజిస్టర్, అనధికార కట్టడాల రిజిస్టర్, అనధికార లేఅవుట్ రిజిస్టర్ల నిర్వహణపై వివరించారు. పంచాయతీల్లో నిర్మాణ అనుమతులు ‘PRIS’ యాప్ ద్వారా మాత్రమే జారీ చేయాలని సూచించారు. RDDTP జి. సుబ్బారావు మాట్లాడుతూ, ఏపీ ఎంఆర్యుడిఏ చట్టంపై పంచాయతీ కార్యదర్శులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, RUDA మార్గదర్శకాలను పాటిస్తూ ఆర్థిక ప్రతిపత్తి పెంపుతో పాటు అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో RUDA సెక్రెటరీ ఎంవీఆర్ సాయి బాబా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్. ప్రశాంత్తో పాటు ఇతర ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News