గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ప్రపంచంలోనే అత్యత్తమ రాజ్యాంగాన్ని అందించిన నాయకుల స్పూర్తితో గుంటూరు నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టడానికి కృషి చేస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిలాలతో కలిసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, జిన్నాటవర్ సెంటర్లలో జాతీయ జెండా ఆవిష్కరణ, హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి, జిఎంసి ప్రధాన కార్యాలయంలో బాబు రాజేంద్ర ప్రసాద్ చిత్ర పటానికి పూలమాలలు వేసి, విధుల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులు, కార్మికులు, సచివాలయ కార్యదర్శులకు ప్రశంశా పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, 1947 ఆగస్ట్ లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోకి వచ్చి దేశం గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి త్యాగాల స్పూర్తితో నగర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి సాధిస్తామన్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కి తగిన విధంగా నగర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్చ, స్వాతంత్ర్యం నాటి త్యాగధనుల కృషేనన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా జీవించేందుకు తగిన వాతావరణం అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మన ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమనే సామాజిక భాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటీ కమిషనర్లు, విభాగాధిపతులు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News