-రాష్ట్ర సంస్కృతి ప్రపంచానికి చాటి చెప్పేలా విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలు
-పర్యాటక అభివృద్ధితో రాష్ట్రానికి ఆదాయం.. యువతకు ఉపాధి
-కొండకర్ల ఆవలో అనకాపల్లి ఉత్సవ్ ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర
అనకాపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా మార్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా ప్రభుత్వానికి ఆదాయం కల్పించేలా అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కొండకర్ల ఆవలో అనకాపల్లి ఉత్సవ్ ను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం కొండకర్ల ఆవలో పర్యాటక ప్రాంతాలను పరిశీలించారు. బోటు షికారు వెళ్లారు. సెల్ఫీ పాయింట్ లో సరదాగా సెల్ఫీలు దిగారు. ఏటికొప్పక బొమ్మల తయారీ, పెయింటింగ్ పై చిన్నారులకు అవగాహన కోసం ఏర్పాటు చేసిన experiential టూరిజం కేంద్రాలను ప్రారంభించారు.
విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలతో ఏపీలో పర్యాటక అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్తామన్నారు. మన రాష్ట్రానికి సుమారు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. సుందరమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వేల సంవత్సరాల చారిత్రక చిహ్నాలున్నాయి. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. గతంలో మచిలీపట్నంలో బీచ్ ఫెస్ట్ నిర్వహించాం. విజయవాడలో ఆవకాయ్ ఉత్సవ్ నిర్వహించాం. ఇప్పుడు ఉత్తరాంధ్రలో పర్యాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.గత ఐదేళ్లు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారు. ప్రతిష్ఠను మసకబారేలా చేశారు. నేడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రజల సంతోషానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, పీలా గోవింద సత్యనారాయణ, మళ్ల సురేంద్ర, కోట్ని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News