-తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు
-తిరుమల పవిత్రతకు వైసీపీ భంగం కలిగించింది
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగన్ రెడ్డి అవినీతి మూలాల్లోంచి పుట్టిన పార్టీ వైసీపీ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు. శనివారం నాడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భీమవరం లోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను నిరంతరం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తిరుమలకు ఉన్న అపార గౌరవాన్ని భ్రష్టుపట్టించిన ఘనత వైసీపీదేనని మండిపడ్డారు. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో కూడా వైసీపీ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని విమర్శించారు. టీటీడీకి డిక్లరేషన్ సమర్పించే సంప్రదాయాన్ని జగన్ మోహన్ రెడ్డి తుంగలో తొక్కారని, 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిన వ్యక్తి ఆయనేనని, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలుగుల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి అన్నారు. దేశ రాజకీయాల్లో తెలుగు ప్రజల గళం వినిపించిన ఏకైక మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం రూ.2 కే పథకాన్ని నేటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయంటే ఆయన సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించి, మహిళా సాధికారతకు జీవం పోసిన నాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్కు పోటీగా నిలిచిన వ్యక్తి ఆయనే అని వ్యాఖ్యానించారు. సంక్షేమ పాలనలో ఎన్టీఆర్ ఆశయాలను నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేశ్ కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిబద్ధతతో అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులనూ వేగవంతం చేశామన్నారు. చెప్పిన మాటకు కట్టుబడి పెన్షన్లు, మహిళలకు ఉచిత బస్, ఉచిత గ్యాస్ సిలెండర్లు, విద్యార్థులకు, రైతాంగానికి ఆర్థిక సహాయం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News