– అర్జీదారుల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించండి
– జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 211 అర్జీలు
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సందర్భంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ ద్వారా అందుతున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి సత్వర పరిష్కారానికి ఆదేశాలిచ్చారు.
పీజీఆర్ఎస్ నాన్ రెవెన్యూ కింద మొత్తం 136 అర్జీలు రాగా వీటిలో పురపాలక శాఖకు 36, పోలీసు శాఖకు 21, పంచాయతీరాజ్కు 20 అర్జీలు ఉన్నాయి. డీఆర్డీఏకు 10, గృహ నిర్మాణానికి 6 అర్జీలు రాగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం, ఆరోగ్య శాఖకు అయిదు చొప్పున, పౌర సరఫరాలు, ఉపాధికల్పన, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కు మూడు చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, విద్యుత్, అడవులు, ఇరిగేషన్, మైన్స్, టూరిజం, ఖజానా శాఖలకు రెండు చొప్పున, సీపీవో, విద్య, గ్రౌండ్ వాటర్, ఐసీడీఎస్, మార్కెటింగ్, గ్రామీణ నీటి సరఫరా, నైపుణ్యాభివృద్ధి, సాంఘిక సంక్షేమం, సాంకేతిక విద్య, గ్రంథాలయ శాఖలకు ఒకటి చొప్పున అర్జీలు ఉన్నాయి.
రెవెన్యూ క్లినిక్ ద్వారా 75 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి, నిర్దిశ్ట గడువులోగా పరిష్కరించాలని, ఈ కార్యక్రమం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలపాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, తిరువూరు ఆర్డీవో కె.మాధురి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, ఏసీపీ కె.వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News