-చెత్త ద్వారా సర్క్యులర్ ఎకానమీ
-కలెక్టరుకు సీఎం అభినందనలు
-రాష్ట్రమంతటా ఈ పద్దతి అమలు చేయాలని ఆదేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను జీరోవేస్ట్ స్కూళ్లుగా మార్చుతూ ఆ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా అధికారులు చేసిన వినూత్న ప్రయత్నం జిల్లా కలెక్టర్ల సదస్సు దృష్టిని ఆకర్షించింది. జిల్లాలో 114 సంస్థల్లో చెత్త, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ వినూత్నంగా వ్యవహరించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తూ అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ దిశగా ఈ విద్యా సంస్థల్లో ఉన్న చదువుతున్న విద్యార్థులు ఈ చెత్తను పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి పారేసేలా వారిలో చైతన్యం కల్పించారు. తడి చెత్తను కంపోస్టుగా తయారు చేయడానికి ఆయా స్కూల పరిధిలో ప్రత్యేకంగా గుంత తవ్వి అందులో వేశారు. ఈ చెత్తను కంపోస్టుగా తయారు చేయడానికి ప్రత్యేకంగా గుంతలు తవ్వి వాటిని రైతులకు ఉపయోగపడే ఎరువుగా తయారు చేస్తున్నారు. హాస్టళ్ల నుంచి వృధాగా వెళ్లే నీరులో హానికరం కాని నీరు, హానికర నీరు అని రెండుగా విడదీసి, అవి బయటకు వెళ్లడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పొడి చెత్తను రీసైక్లింగ్ కోసం ఆయా పరిధిలోని స్వర్ణ సచివాలయానికి అందజేశారు. మురికి నీరును మున్సిపల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటుకు పంపేలా ఏర్పాటు చేశారు. 114 స్కూళ్లలో 24,775 మంది విద్యార్థులకు ఇది లబ్ది కలిగింది. ఈ సంస్థల నుంచి ప్రతి నెలా 57.1 టన్నుల తడి చెత్త, 24.5 టన్నుల పొడి చెత్త పొగవుతోంది. ఈ చెత్తద్వారా హాస్టళ్లకు ప్రతి నెలా రూ.2.17 లక్షల ఆదాయం సమకూరుతోందని అనకాప్లి జిల్లా కలెక్టరు వివరించారు.
సీఎం అభినందనలు
జీరో వేస్ట్ సంస్థలుగా జిల్లాలో రెసిడెన్షియల్ స్కూళ్లను మార్చుతూ అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేసిన ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.. ఈ మోడల్ను అన్ని జిల్లాల కలెక్టర్లు అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఒక మంచి పేరు సూచించాలన్నారు. కేవలం ఇంతటితో ఆగకుండా అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో వారి అవసరాలకు సరిపడేలా కూరగాయలు పండించేలా తోటలు సాగు కూడా చేపట్టాలని. తద్వారా కూరగాయల అవసరాల్లో సమృద్ది సాధించవచ్చన్నారు. ఈ దిశగా కూడా చర్యలు తీసుకోవాలన్నారు
Prajavartha Online Telugu News