మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దిగువ, మధ్యతరగతి నివాస వినియోగదారుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం సౌర విద్యుత్ పథకం ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఏపీ సి పి డి సి ఎల్ సౌర విద్యుత్ పథకంపై రూపొందించిన గోడపత్రాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగువ, మధ్య తరగతి నివాస వినియోగదారులు వారి గృహాలకు తగిన రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ కెపాసిటీ ప్రకారం సబ్సిడీ అందజేస్తుందన్నారు. సరాసరి నెలవారి విద్యుత్ వినియోగం 150 యూనిట్లు వరకు ఉంటే రెండు కిలోవాట్ల వరకు సోలార్ ప్లాంట్ కోసం 30 వేల నుంచి 60 వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. అలాగే 150 నుంచి 300 లోపు విద్యుత్ వినియోగం యూనిట్లు ఉంటే 2 నుంచి 3 కిలోవాట్ల వరకు 60 వేల నుంచి 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. అదేవిధంగా 300 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం ఉంటే 3 కిలో వాట్ల లోపు వరకు 78 వేల రూపాయలు సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఆర్డీవో ఎం వాణి, విద్యుత్ శాఖ ఈఈ భాస్కరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News