– ఫిర్యాదుల పరిష్కారంతో పాటు నివేదికల నిర్వహణ కూడా కీలకం
– పూర్తి అవగాహనతో బృంద స్ఫూర్తితో ఎన్నికల విజయవంతానికి కృషిచేయాలి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నామని.. ఇందులో భాగంగా పటిష్ట సమన్వయానికి జిల్లాస్థాయి సమీకృత కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
సోమవారం కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయ నిర్వహణ వ్యవస్థ (ఈఎస్ఎంఎస్), ఫిర్యాదుల పరిష్కారం, నివేదికల నిర్వహణ, సోషల్ మీడియా సెల్ విధివిధానాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ తదితరాలపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా నోడల్ అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ స్క్వాడ్స్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పర్యవేక్షణ, స్వీప్ కార్యక్రమాలు తదితరాల మధ్య పటిష్ట సమన్వయ సాధనకు కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం కీలకంగా వ్యవహరించనుందని వివరించారు. ఈ కేంద్రం విజయవంతంగా పనిచేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీ విజిల్, నేషనల్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టమ్ (ఎన్జీఆర్ఎస్) తదితర మార్గాల ద్వారా వచ్చే ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించడం ఎంత ముఖ్యమో సరైన విధంగా నివేదికల్లో పొందుపరిచి సమర్పించడం కూడా అంతే ప్రధానమన్నారు. వివిధ విభాగాల కార్యకలాపాలు, నివేదికల సమర్పణలో వేగంతో పాటు కచ్చితత్వం కూడా కీలకమని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన యాప్, పోర్టల్ ఆధారిత ఐసీటీ వేదికలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమలను సద్వినియోగం చేసుకొని విధులపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకొని బృంద స్ఫూర్తితో, నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఓటర్లకు అవగాహన కల్పించడం, చైతన్యవంతులను చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు ఇందుకు సోషల్ మీడియా వేదికలను కూడా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంసీఎంసీ, సోషల్ మీడియా సెల్ ద్వారా పెయిడ్ న్యూస్, ఫేక్ న్యూస్పైనా పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి సీహెచ్ శైలజ, అడిషనల్ డీసీపీ ఎం.కృష్ణమూర్తి నాయుడు, డిప్యూటీ కమిషనర్ (ఐటీ) సవీష్ వర్మ, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News