విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించి నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు నాణ్యత లేని వస్తువులు కొనుగోలు చేయడంవలన ఎదురయ్యే మోసాలను నివారించేందుకు సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు కృషి చేయాలని డిపిఆర్సి ప్రిన్సిపాల్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతిబసు తెలిపారు.
నగరంలోని బందర్ రోడ్డులో గల డిస్ట్రిక్ట్ పంచాయితీ రిసోర్సు సెంటర్ (డిపిఆర్సి) మీటింగ్ హాల్లో సోమవారం నాణ్యత ప్రమాణాలకు సంబంధించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంశంపై జిల్లాకు చెందిన సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని జడ్పిసీఈవో వి. జ్యోతిబసు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలను నిర్దారించే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఐస్ఐ, హాల్ మార్క్ గల వాటిని కొనుగోలు చేసేల ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ పంచాయితీకి సంబంధించి ఎలక్ట్రికల్ వస్తువులు, నిర్మాణాలకు సంబంధించి ఐరన్, సిమెంట్ తదితర వస్తువులను ఐస్ఐ మార్క్ కలిగిన వాటిని మాత్రమే పరిశీలించి కొనుగోలు చేయాలన్నారు. వంటగదులలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు, ప్రెషర్ కుక్కర్, ప్యాకేజిడ్ డ్రింకింగ్ వాటర్, బంగారం మొదలైన వస్తువుల నాణ్యత ప్రమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లయితే నాసిరకపు వస్తువులు కొనుగోలు చేసి మోసపోకుండా నివారించగలుగుతామన్నారు. నాసిరకపు వస్తువులు కొనుగోలు చేయటంవల్ల డబ్బు, సమయం వంటివి వృధా కావడంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఈ నెల 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమంలో సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. గ్రామాలలో నాణ్యత ప్రమాణాలు (ఇండియన్ స్టాండర్డ్స్) వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పించేలా కృషి చేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని జ్యోతిబసు కోరారు.
వర్క్ షాప్ లో ఏపీఎస్ఐఆర్డీ జాయింట్ డైరెక్టర్ వరప్రసాద్, ఇండియన్ స్టాండర్డ్స్ జాయింట్ డైరెక్టర్ సాయి కుమార్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News