Breaking News

జిల్లాలో మే 13న సాధార‌ణ ఎన్నిక‌లకు షెడ్యూల్ ప్ర‌క‌టించిన ఈసీఐ

– జిల్లాలో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి అమ‌లు
– జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త
సార్వత్రిక ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం శ‌నివారం షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన నేప‌థ్యంలో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని.. ఇందుకు సంబంధించి జిల్లాలో ఈసీఐ మార్గదర్శకాలను ప‌టిష్టంగా అమ‌లుచేయాల‌ని జిల్లా ఎన్నిక‌ల అధికారి, జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జిల్లాలో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళికి అమ‌లుకు సంబంధించి అధికారులు వెంటనే త‌గిన చర్య‌లు తీసుకోవాల‌న్నారు.
ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన స‌మ‌యం నుంచి 24 గంటల్లోపు ప్రభుత్వ ఆస్తులపై వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, పేపర్లు, కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, జెండాలు త‌దిత‌రాల‌ను తొల‌గించాల‌న్నారు. పబ్లిక్ ఆస్తుల వద్ద, బస్టాండ్, రైల్వే స్టేషన్, రైల్వే వంతెనలు, రోడ్‌వేలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లాల్లో వాల్ రైటింగ్‌లు, పోస్టర్లు, పేపర్లు, కటౌట్‌లు, హోర్డింగ్‌లు, బ్యానర్‌లు, జెండాలు, రాజకీయ ప్రకటనలు మొదలైనవి 48 గంటలలోపు తొలగించాల‌న్నారు. ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రభుత్వం సాధించిన విజయాలను చూపే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనల‌ను వెంటనే నిలిపివేయాల‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో రాజకీయ నాయకులు, మంత్రులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్ని సూచనలు మరియు రాజకీయ నాయ‌కుల ఫోటోల‌ను అధికారిక వెబ్‌సైట్‌ల నుండి వెంటనే తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన 72 గంటలలోపు ఇప్పటికే ప్రారంభించబడిన పనులు, ప్రారంభించని తాజా పనుల జాబితాల‌ను, అభివృద్ధి, నిర్మాణానికి సంబంధించిన అన్ని విభాగాలు, ఎంసీసీ ఉల్లంఘనల‌పై ఫిర్యాదును ప‌రిశీలించేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి, జిల్లా ఎన్నిక‌ల అధికారి సూచనల కోసం అందించాల‌న్నారు.
ఎన్నికల ప్రచారానికి మంత్రులు అధికారిక వాహనాలను ఉపయోగించడంపై నిషేధం ఉంద‌న్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులు, సిబ్బంది బదిలీలపై పూర్తి నిషేధం ఉంటుంద‌న్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయ‌కుల ఛాయాచిత్రాల‌ను ప్రభుత్వ భవనాలపై ప్ర‌ద‌ర్శించ‌రాద‌న్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు, అధికారుల మధ్య వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా వీడియో కాన్ఫరెన్స్ చేయడం నిషిద్ధ‌మ‌న్నారు.
లబ్ధిదారులకు పంపిణీ చేయబడిన లబ్ధిదారుల కార్డులు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో ఏర్పాటు చేయబడిన నిర్మాణ స్థల ఫలకాలు మొదలైన వాటిలో ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఇతర రాజకీయ కార్యకర్తల ఫోటోలు, సందేశాలు ఉండరాద‌న్నారు. ఏది ఏమైనప్పటికీ, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలుకు ముందు పంపిణీ చేయబడిన/ప్రతిష్టించబడిన లబ్ధిదారుల కార్డులు, నిర్మాణ స్థ‌ల ఫలకాలు మొదలైన వాటిపై రాజకీయ నాయ‌కుల ఫోటోలకు సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదని ఆయ‌న తెలిపారు.

మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందించబడే విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, బోర్డింగ్ పాస్‌లు, టీకా సర్టిఫికెట్లు మొదలైన వాటిలో రాజకీయ నాయ‌కులు, పార్టీల ఫోటోలు లేదా సందేశాలు, చిహ్నాలు ఉండకూడద‌న్నారు. ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ఏర్పాటుచేసిన హోర్డింగ్‌ల‌పై రాజ‌కీయ ప్రకటనలు వెంటనే తీసివేయాల‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. బీకాన్ లైట్లు ఉన్న పైలట్ కార్లు లేదా సైరన్ వాడుతూ కారు రాజ‌కీయ నాయ‌కులు వారి ఉనికిని ప్రస్ఫుటంగా ప్ర‌ద‌ర్శించేలా ఎన్నికల సందర్శనలలో ఉపయోగించకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
ఎన్నికల పర్యటనల్లో మంత్రులకు ప్రభుత్వ అతిథి గృహాలలో వసతి కల్పించరాదన్నారు. ఎంపీల్యాడ్‌, ఎమ్మెల్యే ల్యాడ్ లేదా ఇతర ప్రభుత్వ పథకాల కింద నిధులు సమకూర్చబడిన నీటి ట్యాంకులు, అంబులెన్స్‌లు త‌దిత‌రాల‌పై ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోటోలు ఉన్న‌ట్ల‌యితే వాటిని క‌ప్పిఉంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.
జీవిత భాగస్వామి రాజకీయ రంగంలో చురుగ్గా ఉన్న అధికారులందరూ ప్రధాన కార్యదర్శి యొక్క నిర్దిష్ట అనుమతితో మినహా ఎన్నికలు పూర్తయ్యే వరకు సెలవుపై లేదా పర్యటనలో వారి ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లకూడదని క‌లెక్ట‌ర్ అన్నారు. ప్ర‌భుత్వోద్యోగి ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి. వారు ఏదైనా పార్టీ లేదా అభ్యర్థికి అనుకూలంగా ఉన్నారనే అనుమానం రాకుండా ఉండాల‌న్నారు. ఉల్లంఘిస్తే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న‌ట్లు భావించి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. రాజకీయ పార్టీ నిర్వహించే ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా, రాజకీయ ప్ర‌చారంలో పాల్గొన్నా, రాజకీయ పార్టీల‌ నుండి ఏదైనా ప్రయోజనం, బహుమతి పొందడం, ఎన్నికల సమయంలో అనవసరమైన ప్రభావాన్ని చూపడానికి ప్రయత్నించడం వంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావ‌ళి కింద క్రమశిక్షణా చర్యలు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఐపీసీ 171, ప్ర‌జాప్రాతినిథ్య చ‌ట్టం, 1951లోని 123, 129, 134 మరియు 134A సెక్షన్ల‌ను ఉల్లంఘిస్తే, అటువంటి ప్రభుత్వ ఉద్యోగిపై చట్టపరమైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లాలో సాధార‌ణ ఎన్నిక‌ల‌ను నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు స‌మ‌ష్టి కృషిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *