రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య హేతుబద్ధీకరణ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అందుకు సంబంధించి రాజకీయ పార్టీలు తమ వంతుగా సహకారం అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ మూర్తి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోనీ స్థానిక డీ ఆర్ వో ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో టి సీతారామ మూర్తి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 1581 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వాటిలో 1191 కేంద్రాల్లో 1200 మందికి కంటే తక్కువ ఓటర్లు ఉండగా, మిగిలిన 390 పోలింగ్ కేంద్రాల్లో 1200 పైబడి ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. వీటిని హేతుబద్ధీకరణ ప్రక్రియ ద్వారా సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కోసం రాజకీయ పార్టీల సూచనలు సలహాలు స్వీకరించడం జరుగుతోందన్నారు. జిల్లాలో 16,21,270 మంది ఓటర్లు ఉండగా పురుషులు 7,91,204 మహిళలు 8,29,970 మంది, ఇతరులు 96 మంది ఉన్నారని తెలిపారు. పిడబ్ల్యుడి ఓటర్లు 19,559, వి ఐ పి ఓటర్లు 2,791 , విదేశీ ఓటర్లు 461 మంది ఉన్నారన్నారు. జనవరి 6 వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఫారం 6 , 7 , 8 ల ద్వారా 10,630 ఫారం లు స్వీకరించగా 10, 020 ఫారాలను పరిష్కారం చేసినట్లు, ఇంకా 610 ఫారం లు పరిష్కారం చెయ్యవలసి ఉందన్నారు. అసెంబ్లీ నియోజక వర్గాల పరిథిలో ఓటర్ల జాబితా హేతుబద్ధత కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం కోసం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిటీ వేయడం జరిగిందన్నారు. నిడదవోలు , కొవ్వూరు నియోజక వర్గాలు తప్ప మిగిలిన నియోజక వర్గాలలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అంతకు ముందు జిలా కలెక్టర్లు అసెంబ్లీ నియోజక వర్గాల ఈ ఆర్ వో లతో పెండింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు వైఎస్ఆర్ సిపి పార్టీ, టి. దేవదానం, టిడిపి పార్టీ, ఎం శివ సత్య ప్రసాద్, జె ఎస్ పి పార్టీ, ఏ శ్రీనివాసరావు, సిపిఐఎం పార్టీ పి. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News