విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ లెనిన్ సెంటర్ సూపర్స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఆదివారం పద్మాలయ సంస్థ అధినేత, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కృష్ణ మనుమడు, రమేష్బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగించిన చిత్రాలను అందించిన సూపర్స్టార్ కృష్ణ నేటితరం హీరోలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంటి స్వాతంత్య్ర పోరాటయోధుడి గాథను తెలుగు ప్రేక్షకులకు అందించిన కృష్ణ మానవత్వానికి మరోపేరు అని అన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాను ఆదరించడం ద్వారా జయకృష్ణను సూపర్స్టార్గా నిలబెట్టాలని కోరారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతకాలం గుర్తుండిపోయే వ్యక్తి కృష్ణ అని అన్నారు. జయకృష్ణ మాట్లాడుతూ తాతగారి పేరు నిలబెట్టడమే తన లక్ష్యమన్నారు. అనంతరం వక్తలు సూపర్స్టార్ కృష్ణ కాంస్య విగ్రహం ప్రతిష్టించిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత సి.అశ్వనీదత్, జెమినీ కిరణ్, బోస్, విగ్రహ కమిటీ కన్వీనర్లు కె.సుధా స్వామి, జితేంద్ర, శీరం బుజ్జి తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Prajavartha Online Telugu News