Breaking News

పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరం

-నాలుగు ముఖ్యమైన రైళ్లకు పిఠాపురంలో హాల్ట్ మంజూరు చేయండి
-కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారితో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఈ ఆర్వోబీని మంజూరు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో అశ్విని వైష్ణవ్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పలు రైల్వే ప్రాజెక్టులు, ప్రజల అవసరాల గురించి చర్చించారు. ‘పిఠాపురం పట్టణ పరిధిలోని V-V సెక్షన్‌లో, సామర్లకోట-ఉప్పాడ రోడ్డులో రైల్వే కి.మీ 640/30-32 వద్ద లెవెల్ క్రాసింగ్ నంబర్ 431కి బదులుగా ఆర్‌ఓబీ అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిరంతరంగా ఉండే ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, ఆ ప్రాంతంలో రోడ్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఈ మౌలిక సదుపాయాల కల్పన చాలా అవసరం. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి ‘గతి శక్తి’ కార్యక్రమం ద్వారా మంజూరు చేయాల’ని కోరారు.
అదే విధంగా పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. నాందేడ్ – సంబల్పూర్ నాగావళి ఎక్స్ ప్రెస్, నాందేడ్ – విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం- సాయి నగర్ షిర్డీ ఎక్స్‌ ప్రెస్, ఏపీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం – న్యూఢిల్లీ)కి పిఠాపురంలో హాల్ట్ అవసరమని తెలిపారు.
ఈ సందర్భంగా – లాతూరు ప్రజలు చేసిన విన్నపాన్ని రైల్వే శాఖ మంత్రి ముందు ఉంచారు. లాతూరు నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని తెలుపుతూ ఈ ప్రతిపాదనపై పరిశీలన చేయాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *