Breaking News

ఉపాధి పథకంలో గ్రామాభివృద్ధి మెండుగా జరగాలి

-కొత్త పనులను చేర్చాలి… గ్రామాల్లో అంతర్గత పనులకు అనుమతివ్వాలి
-కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్  మంగళవారం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పలు కీలకమైన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతిపాదిత అంశాలను పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి ముందు ఉంచారు.
‘‘ఉపాధి పథకంలో కూలీల బడ్జెట్ ను పెంచడం ఎంతో ప్రయోజనకరం. రూ.2081 కోట్ల కూలీల వేతన సొమ్ములను వెంటనే విడుదల చేసినందుకు ధన్యవాదాలు. అధునాతన వాటర్ షెడ్ల నిర్మాణ పథకం కింద రాష్ట్రానికి 59 ప్రాజెక్టులను కేటాయించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గిరిజనులకు ఆర్థిక శక్తి పెపొందించేలా కాఫీ తోటల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఉపాధి పనుల్లో భాగంగా పిఎమ్ ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టుకోవడానికి 90 రోజులు పని దినాలు ఉంటాయి. అలాంటి వారికి అదనంగా 100 రోజుల పని దినాలు కల్పించాలనేది మా ఆలోచన. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. దీంతో పాటు ఉపాధి నిధులతో శ్మశానవాటికలు, పంచాయతీ భవనాలకు ప్రహరీల నిర్మాణం, దోబిఘాట్ లు, ఆరోగ్య సబ్ సెంటర్లు, గ్రామాల్లో తాగునీటికి అవసరమైన పనులు చేసేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఇస్తే గ్రామీణులకు మరింత ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ షెడ్ పథకం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా కరవు ప్రాంతాల్లో ఎంతో ఉపయోగపడే ఈ పథకానికి రాష్ట్ర వాటా నిధులను తగ్గించి 90 : 10 దామాషా ప్రకారం నిధుల కేటాయింపులు జరపాలని కోరుతున్నాము.
• గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం
గ్రామీణ రోడ్లను ఆధునీకరించడానికి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన, ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు, నాబార్డు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో 2,643 గ్రామాలకు అనుసంధాన రోడ్లు వేయాలని గుర్తిస్తే, దానిలో పీఎం గ్రామీణ సడక్ యోజన కింద 413 రోడ్లు నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించింది. 2,230 గ్రామాలకు ఇంకా అనుసంధాన రోడ్లు వేయాల్సి ఉంది. గ్రామీణ సడక్ యోజన – 4 కింద గ్రామాల్లోని అంతర్గత దారులు కూడా బాగు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ముఖ్యంగా పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, పరిపాలన భవనాలకు వెళ్లే అధ్వాన రోడ్లను బాగు చేసుకునేందుకు కేంద్రం చొరవ చూపాలి. 100 జనాభా దాటిన గ్రామాలకు సైతం అనుసంధాన రోడ్లు వేసుకునేందుకు పథకంలో చోటు కల్పించాలి” అని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *