-ధైర్యానికి, వినయానికి ప్రతీక హనుమాన్
-మంత్రి కందుల దుర్గేష్
-రాజమహేంద్రం, నిడదవోలు సహా పలు ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్
-ప్రజలందరిపై ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన మంత్రి దుర్గేష్
-రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ప్రత్యేక పూజలు
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కందుల దుర్గేష్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలం కడియం, బుర్రిలంకలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు, కానూరు అగ్రహారం, పెరవలి, ఖండవల్లి, ఉండ్రాజవరం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య వేదాశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువజన సంఘాలు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ శ్రీ రాముడి బంటు అయిన ఆంజనేయస్వామి సమర్థుడైన కార్యసాధకుడు అని తెలిపారు. విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉంటూ విజయవంతంగా ఎలా అధిగమించాలో ఆంజనేయస్వామి చరిత్రను తెలుసుకుంటే బోధపడుతుందన్నారు. భక్తి, బలం, సేవకు చిహ్నమైన ఆంజనేయుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంజనేయుని కృపతో ప్రతి ఒక్కరికీ విజయం, ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. భక్తి, ధైర్యం, సేవా తత్త్వం కలిగిన హనుమంతుడి తత్త్వం మన జీవన విధానంగా మారాలని సూచించారు. ఆపదలలో ఆవిర్భవించి భక్తులకు అండగా నిలిచే ఆంజనేయస్వామిని స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News