-అఖిలభారత కిసాన్ సభ డిమాండ్
ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో న్యూఢిల్లీలోని అజయ్ భవన్ నుండి సెంట్రల్ ఫోస్టు ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండో- అమెరికన్ డీల్ ను రద్దుచేయాలని,విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలను విధించాలని, దేశ రైతాంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం స్వస్తి పలకాలని నినదించారు.
ఈ కార్యక్రమం సందర్భంగా అఖిల భారత కసాన్ సభ జాతీయ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రాజన్ క్షీరసాగర్,రావుల వెంకయ్యలు మాట్లాడుతూ దేశీయ రైతాంగం రక్షణ కోసం తక్షణమే ఇండో- అమెరికన్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఇండో -అమెరికన్ ఒప్పందం వల్ల భారత వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని,ప్రధానంగా పాల రైతులు,పౌల్ట్రీరైతులు మరియు నూనె గింజల పంటలు పండించే రైతులు, పప్పు ధాన్యాల పంటలను సాగు చేసే రైతాంగం తీవ్రంగా నష్టపోతారన్నారు.దేశీయ వ్యవసాయ రంగానికి ప్రమాదకరంగా పరిమణించే తక్షణమే ఇండో- అమెరికన్ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని అఖిలభారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి రావుల వెంకయ్య డిమాండ్ చేశారు.ముడిఆయిల్ దిగుమతులపై 27.5% ఉన్న దిగుమతి సుంకాలను 16.5 శాతానికి తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దేశీయ రైతులను ఆదుకోవడానికి దిగుమతి సుంకాలను పెంచాలని డిమాండ్ చేశారు.
జాతీయ అధ్యక్షులు రాజన్ క్షీరసాగర్ మాట్లాడుతూ ఇండో- అమెరికా స్వేచ్ఛ వాణిజ్య వ్యాపారం వలన ఇతర దేశాల నుంచి దిగుమతవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గించటం వలన దేశీయ రైతులు పండించే పంటలకు ధరలు పడిపోయి తీవ్రంగా నష్టపోతారని కాబట్టి దేశీయరైతుల రక్షణ కోసం, భారతదేశ వ్యవసాయ రంగాన్ని కాపాడటం కోసం ఈ ఇండో- అమెరికన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దేశంలో 62% ప్రజలు వ్యవసాయరంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని ఇటువంటి వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తులకు కట్టబెట్టే విధానాలను ఆమోదించకూడదన్నారు. దేశవ్యాప్తంగా ఆగస్టు 13న సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన మోడీ, ట్రంప్ ల దిస్టి బొమ్మలు దగ్దం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కిసాన్ సభజాతీయ నాయకులు కెడి సింగ్ , సిరి కుమార్ ముఖర్జీ, తారా సింగ్ సిద్ధూ, మశీలమణి,చిత్తార్ సింగ్ ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వి. వి. ప్రసాద్, జాతీయ సమితి సభ్యులు పి.జమలయ్య, బుడితి అప్పలనాయుడు, కె.వీరారెడ్డి, పి గంగాభవానిలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News