మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి గల రైతులను గుర్తించి సాగు వైపు ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించే కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం వలన కలిగే లాభాలను వివరిస్తూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదివరకే ప్రకృతి వ్యవసాయంలో విజయవంతమైన ఆదర్శ రైతులను గుర్తించి వారి స్వానుభవాలను ఇతర రైతులకు వివరించే విధంగా సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుందని అధికారులకు సూచించారు. గ్రామాలలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పించడం ద్వారా కూడా ప్రకృతి వ్యవసాయంలోని ప్రయోజనాలను రైతులకు అవగాహన కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కేవలం వరి పంటలు మాత్రమే కాకుండా పండ్లు, కూరగాయలు సైతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే రైతులను గుర్తించి వారి ద్వారా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ సాగు పద్ధతిలో పండించే పంటలకు ఉన్న డిమాండ్ ను రైతులకు వివరించాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు వాటితో పండించే పంటల వినియోగంతో కలిగే అనారోగ్య దుష్ఫలితాలను వివరించాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో ఏపీ ప్రకృతి వ్యవసాయ డిపిఎం పార్థసారథి, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు మనోహర్రావు, జె జ్యోతి, చిననరసింహులు, డి ఆర్ డి ఎ పి డి హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News