-శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ( గాంధీ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర స్థిరాస్తి రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని, అభివృద్ధిలో తిరోగమించిందని, ఆ కారణంగా రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) వ్యాఖ్యానించారు. నగరంలోని ఏ కన్వెన్షన్లో జరుగుతున్న నారెడ్కో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ శనివారం రెండో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాను ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బొర్రా మాట్లాడుతూ విజయవాడ, అమరావతి ప్రాంతాలు రాష్ట్ర భవిష్యత్తుకు కేంద్ర బిందువుల వంటివని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపకరించేవని తెలిపారు . ప్రజలకు ఈ అభివృద్ధి పట్ల పూర్తి అవగాహన కల్పించేందుకు నారెడ్కో ఏర్పాటు చేసిన ఈ స్థిరాస్తి ప్రదర్శన చాలా ఉపయోగకరంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొనుగోలు దారులలో నమ్మకాన్ని పెంచి ఈ రంగం అభివృద్ధికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.
విజయవాడ నగర పాలక సంస్థ తెలుగుదేశం పక్ష నేత బాల స్వామి మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల చర్యలు మరింత ఉపశమనం కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి ప్రత్యేక స్థానం సంపాదిస్తుందని, ఇక్కడ ప్రతి ఇంటికి ఉద్యోగ, వ్యాపార అవకాశాలు లభించేలా పరిస్థితులు మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం తో ఈ కార్యక్రమం ముగియనుండగా గత రెండు రోజుల్లో 5 వేలకు పైగా సందర్శకులు ప్రదర్శనకు వచ్చి నూతనంగా స్థిరాస్తి కొనుగోలు పట్ల తమ ఆసక్తిని తెలియజేశారు. కార్యక్రమంలో నారెడ్కో సెంట్రల్ జోన్ ఛైర్మెన్ సందీప్ మండవ, రాష్ట్ర నిర్వహక ఉప కార్యదర్శి కిరణ్ పరుచూరి, హరి ప్రసాద రెడ్డి, చావా రమేష్, కోడ్ జగన్, వేమూరి సుబ్బారావు, ముసునూరి ప్రసాద్, శరత్, వాసిరెడ్డి వంశీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News