తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు ముఖ్యమంత్రి కి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా 2026 ఏడాది టిటిడి డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అనంతరం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులలో జేఈవో వీరబ్రహ్మం, ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News