-భక్తజన పరవశం…
-అర్ధరాత్రి నుంచే భక్తులతో నిండిపోయిన ఆలయ పరిసర ప్రాంతాలు…
-భక్తులను క్రమపద్ధతిలో దర్శనానికి పంపేందుకు కృషి చేస్తున్న అధికారి యంత్రాంగం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు మూలా నక్షత్రం అందుకే ఈ రోజు కనకదుర్గా దేవి.. సరస్వతీ దేవీ మాత రూపంలో దర్శనం ఇస్తున్నారు.
అమ్మలగన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఈ రోజు భక్తులకు సరస్వతి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు. నవరాత్రులలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన మూలా నక్షత్రం రోజైన ఈ రోజు అమ్మవారు సరస్వతిదేవిగా భక్తులకు దర్శనమిస్తూ విద్యాబుద్ధులు ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం అనగా జగన్మాత జన్మనక్షత్రం.. అందుకే ఈరోజు ఎంతో ప్రాశస్త్యం కలిగిన రోజుగా భావిస్తారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తులతో అర్ధరాత్రి నుండే కిటకిటలాడుతోంది. సరస్వతి దేవిని దర్శించుకుని పూజలు చేస్తే.. విద్యాబుద్ధులు, చక్కని తెలివితేటలను ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రం.. మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీదుర్గాదేవికీ శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో అలంకరించబడుతుంది. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి శ్రీ దుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీసరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకం.
Prajavartha Online Telugu News