-ఈ ఏడాది కొనుగోలులో రూ.2.21 కోట్లు ఆదా
-రెండు సార్లు టెండర్లు పిలిచినా ఒక్క కేరళ సంస్థే బిడ్ దాఖలు
-ధర విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం
-గతంలో కర్నాటక ధరల కంటే 13 శాతం అధిక ధరతో కొనుగోలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు రూ. 14 కోట్ల మేరకు హోమియో మందులు కొనడానికి ఆయుష్ విభాగం ప్రతిపాదించింది. రెండు సార్లు టెండర్లు పిలిచినా కేరళ ప్రభుత్వ సంస్థ ఒక్కటే స్పందించిందని, మందుల అవసరాల దృష్ట్యా కొనుగోలుకు అనుమతించాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ను ఆయుష్ విభాగం కోరింది. అనుమతిని మంజూరు చేస్తూ….ఒకటే బిడ్ వచ్చినందున కోట్ చేసిన ధర సరసమైనదా లేదా అని పరిశీలించి బిడ్ను ఆమోదించాలని మంత్రి ఆదేశించారు. మంత్రి ఉత్తర్వుల మేరకు సరఫరాదారునితో చర్చించి కోట్ చేసిన ధర కంటే 16.88 శాతానికి తక్కువతో ఆయుష్ విభాగం ధరను నిర్ణయించింది. దీనివల్ల మొత్తం కొనుగోలులో రూ.2.21 కోట్లు ఆదా ఆవుతుంది.
టెండర్ ప్రక్రియ-ధరల నేపథ్యం
రూ.4 కోట్ల విలువ చేసే హోమియో మందుల కొనుగోలుకు ఆయుష్ విభాగం రెండు సార్లు టెండర్లు పిలవగా ప్రభుత్వరంగ సంస్థ ‘కేరళ హోమియోపతిక్ కోపరేటివ్ ఆర్గనైజేషన్ (HOMCO)’ మాత్రమే స్పందించింది. రెండవసారి వచ్చిన టెండర్ ధర సమంజసంగా ఉందా లేదా అని పరిశీలించాలని ఆదేశిస్తూ కొనుగోలుకు మంత్రి ఆమోదం తెలిపారు.
ఫైనాన్షియల్ బిడ్ తెరచి చూసిన అధికారులు సింగిల్ బిడ్డర్ కోట్ చేసిన ధరపై విస్తృతంగా చర్చించారు. ఇదే కంపెనీ గతంలో కర్నాటకు, ఆంధ్రప్రదేశ్కు హోమియో మందులు సరఫరా చేసిన ధరను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే కంపెనీ కర్నాటకు సరఫరా చేసిన ధర కంటే 13 శాతం అధిక ధరకు మన రాష్ట్రానికి సరఫరా చేసిందని గుర్తించారు.
సరఫరాదారునితో విస్తృత చర్చలు చేసిన అనంతరం కోట్ చేసిన ధర కంటే 16.88 శాతం తక్కువకు హోమియో మందుల సరఫరాకు అధికారులు ఒప్పందం చేసుకున్నారు. ఇది కర్నాటక ధర కంటే 6.04 శాతం తక్కువ. 2023-24 లో రాష్ట్రానికి సరఫరా చేసిర ధర కంటే కూడా 6 శాతం తక్కువ. వెరశి…ఈ చర్యల ద్వారా రాష్ట్రానికి రూ.2.21 కోట్లు ఆదా అవుతుందని ఆయుష్ అధికారులు వివరించారు.
సంవత్సరం పాటు అమలులో ఉండే ఈ కాంట్రాక్ట్ ధరతో రూ.14 కోట్ల విలువచేసే మందుల్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేస్తారు
మంత్రి అభినందనలు
తన ఆదేశం మేరకు సరఫరాదారునితో చర్చలు జరిపి ఈ ఆర్థిక సంవత్సరంలో కొనుగోలు చేయనున్న హోమియో మందుల ధరలను భారీగా తగ్గించినందుకు ఆయుష్ విభాగం డైరెక్టర్ కొత్తమాసు దినేష్, ఇతర అధికారులను మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు.
రూ.14 కోట్ల విలువ చేసే 162 రకాల హోమియో మందుల్ని 207 హోమియో వైద్య శాలలకు, 3 బోధానాసుపత్రులకు ఆయుష్ విభాగం అందజేస్తుంది
Prajavartha Online Telugu News