ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
వందేమాతరం గీతం 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చలో వైసీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ప్రసంగించారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదని, సామాన్యులను స్వాతంత్య్ర సమరయోధులుగా మలిచిన శక్తి అని, అది దేశమాతకు ఆత్మ వంటిదని అభివర్ణించారు. పేదలు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే నిజమైన దేశభక్తి అని ఎంపీ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఈ భావజాలానికి నిలువుటద్దమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి ప్రయోజనం చేరే విధంగా పారదర్శకంగా, వివక్ష లేకుండా అమలు చేసిన ఈ కార్యక్రమాలు వందేమాతరం అర్ధాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన తెలిపారు.
ఇదే సందర్భంలో, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య విద్య ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులు డాక్టర్లయ్యే కలను దూరం చేస్తున్నారని, అన్నం పెట్టే రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదని విచారం వ్యక్తం చేశారు. పాఠశాలలు, హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని చిన్నారులు ఆసుపత్రుల పాలవుతున్నారని, తిరుపతి సంస్కృత వర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపుల ఘటన దేశ ఆత్మను గాయపరిచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వందేమాతరాన్ని గౌరవించడం అంటే చరిత్రను కీర్తించడం మాత్రమే కాదని, నేటి అన్యాయాలను ఎదిరించి, భరతమాత బిడ్డలందరికీ న్యాయం జరిగేలా చూడటమేనని వందేమాతరం నినాదంతో ఎంపీ తన ప్రసంగాన్ని ముగించారు.
Prajavartha Online Telugu News