-కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ వెల్లడి.
-దేవాలయాల్లో సౌర కార్పోర్టులపై ప్రశ్నించిన ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, లావు శ్రీ కృష్ణ దేయరాయులు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
గుజరాత్లోని మోధేరా సూర్య దేవాలయం తరహాలో దేశంలోని ప్రముఖ దేవాలయాల్లో సోలార్ కార్పోర్ట్లను ఏర్పాటు చేసే అంశంపై ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్ర నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నిక్ లోక్సభలో స్పష్టం చేశారు.
లోక్ సభలో బుధవారం ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుమళ్ల ప్రసాదరావు, టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయాల్లో సోలార్ కార్పోర్ట్ల ఏర్పాటు పై కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ లిఖిత పూర్వకంగా బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, విజయవాడ, అన్నవరం, అహోబిలం, అరసవల్లి వంటి ప్రధాన దేవాలయాల్లో గుజరాత్లో మోధేరాలో అమలైన సోలార్ కార్పోర్ట్ నమూనా ప్రతిపాదన, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఆలయ ట్రస్టులతో చర్చలు వంటి ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్రం మంత్రి స్పష్టం చేశారు.
ఆలయాల ఆధారిత సౌర ప్రాజెక్టులకు ఇప్పటికే అమల్లో ఉన్న పునరుత్పాదక ఇంధన పథకాల కింద ఆర్థిక లేదా సాంకేతిక సహాయం అందించే ఉద్దేశం కూడా లేదని వెల్లడించారు. అయితే, మార్చి 2020లో నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆమోదించిన పథకం ప్రకారం గుజరాత్లోని మోధేరా సూర్య దేవాలయ పట్టణం సోలరైజేషన్ కార్యక్రమంలో భాగంగా మోధేరా గ్రామంలో సోలార్ కార్పోర్ట్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో దేవాలయాల వద్ద సోలార్ కార్పోర్ట్ల ద్వారా గ్రిడ్పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా ఎటువంటి అంచనా సామర్థ్య లక్ష్యాలు కూడా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి శ్రీపాద్ యెస్సో నాయక్ బదులిచ్చారు.
Prajavartha Online Telugu News