-ఐటీ, టూరిజం హబ్ సహా భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్ని హెలికాప్టర్ నుంచి తిలకించిన సీఎం
-విశాఖ ఎకనామిక్ రీజియన్ లో కనెక్టివిటీపై అధికారులకు సూచనలు
విశాఖ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాజెక్టుల పురోగతి తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష అనంతరం ఆ ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిని సీఎం హెలికాప్టర్ ద్వారా వీక్షించారు. నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ ఐటీ సెజ్ విస్తరించిన కాపులుప్పాడ వద్ద ఐటీ హబ్, జీసీసీ ప్రాజెక్టుల నిర్మాణాలను సీఎం పరిశీలించారు. సాగర తీరాన్ని ఆనుకుని భీమిలి వద్ద ఏర్పాటు అవుతున్న టూరిజం హబ్ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ నుంచి తిలకించారు. అక్కడకు సమీపంలోనే భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనుల పురోగతిని పరిశీలించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రహదారుల కనెక్టివిటితో పాటు అనుసంధానంగా టౌన్ షిప్ అభివృద్ధి తదితర పనులకు సంబంధించి అధికారులకు సూచనలు చేశారు. అలాగే భోగాపురం వద్దే ఎడ్యుకేషన్ హబ్ లో భాగంగా ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖలోని ఆనందపురం వద్ద వివిధ డేటా సెంటర్లకు కేటాయించిన భూములను కూడా సీఎం ఏరియల్ విజిట్ ద్వారా పరిశీలన చేశారు. వీటితో విశాఖ ఎకనామిక్ రీజియన్ లో భాగంగా సబ్బవరం, పెందుర్తి మండలాల్లో వచ్చే వివిధ పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు భూముల లభ్యత గురించి కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేసిన సీఎం విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో ఐటీ, ఫార్మా, ఇండస్ట్రియల్ తదితర క్లస్టర్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులకు రోడ్డు, రైల్ కనెక్టివిటితో పాటు లాజిస్టిక్స్ కు సంబంధించి కూడా అధికారులకు సూచనలు చేశారు.
Prajavartha Online Telugu News