-మచిలీపట్నంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో గోదాము నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతుకు మెరుగైన ఆదాయం కల్పించినపుడే అసలైన అభివృద్ధి సాకారమైనట్లు అని రాష్ట్ర గనులు, భూర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో ఏపీ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన రెండు గోదాముల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పంట పండించిన రైతు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంటను నిల్వ చేసుకునేందుకు వీలుగా మార్క్ ఫెడ్ పని చేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలో తొలిసారి రూ.6.50 కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో గోదాములు నిర్మించడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడంతో పాటుగా, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టడం మరింత ఆవశ్యకరం అన్నారు. ఇలాంటి గోదాముల కారణంగా రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకునేందుకు అవకాశం కల్పించొచ్చునన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు నిర్మించాలని మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజును సూచించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ అనిత, మార్కెట్ యార్డు ఛైర్మన్ కుంచె నాని తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News