– రేషన్కార్డుదారులకు పరిపుష్టి పోషకాల చెక్కి గోధుమపిండి
– ప్రతినెలా రూ. 20కే కిలో గోధుమ పిండి పంపిణీ
– లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
– రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్కార్డు దారులకు ప్రభుత్వం రూ.20కే కిలో చెక్కి గోధుమపిండి అందిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్.డిల్లీరావు తెలిపారు.
విజయవాడ అర్బన్ పరిధిలోని పటమట, ఏపీఐఐసీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో కార్డుదారులకు గురువారం చెక్కి గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్.డిల్లీరావు.. పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్.డిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉపముఖ్యమంత్రి, గౌరవ మంత్రివర్యులు ప్రత్యేక సమావేశంలో చేసిన సూచనలు దిశానిర్దేశానికి అనుగుణంగా కొత్త సంవత్సరం ప్రారంభం రోజున సంక్రాంతికి ముందు ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. మంచి రాయితీతోనే నాణ్యమైన, పోషకాలతో కూడిన గోధుమ పిండిని అందించడం జరుగుతోందన్నారు. ప్రతినెలా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 1,850 మెట్రిక్ టన్నుల గోధుమలను తీసుకొని ప్రస్తుతం గోధుమపిండి సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రోలర్ మిల్లింగ్తో పోల్చితే స్టోన్ గ్రైండింగ్ వల్ల ఫైబర్ వంటివి తగ్గిపోకుండా ఉంటాయని.. ఈ నేపథ్యంలో మిల్లింగ్ సమయంలో పోషకాలు ఎక్కువగా నష్టపోకుండా ఉండేలా చర్యలు తీసుకొని చిక్కి గోధుమపిండిని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు జిల్లా ప్రధాన కేంద్రాల్లో సరఫరా చేస్తున్నామని.. దశల వారీగా కార్యక్రమాన్ని విస్తృతం చేయనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ పంపిణీలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులకు వివిధ సరుకులు పంపిణీ చేస్తున్నామని.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రభుత్వం నాణ్యమైన పోషక సహిత గోధుమపిండిని అందించడం జరుగుతోందన్నారు. మిల్లింగ్, ప్యాకింగ్, రవాణా ఇలా ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పేదల క్షేమం, సంక్షేమం లక్ష్యంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలను పట్టాలకెక్కిస్తోందని.. వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
కార్యక్రమంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, ఏఎస్వో శ్రీనివాసులు నాయుడు, జిల్లా డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News