– బాగా చదువుకొని తల్లిదండ్రుల కష్టానికి తగిన ఫలితాలివ్వండి
– మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నతంగా ఎదగండి
– బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి
– పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగడం ద్వారా కుటుంబంలో కొత్త వెలుగులు నింపొచ్చని.. డా. బీఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, కల్పనాచావ్లా వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విద్యార్థులతో అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియతో కలిసి శుక్రవారం కంచికచర్ల మండలం, పెండ్యాల జెడ్పీ ఉన్నతపాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షల సన్నద్ధత స్థితిగతులను పరిశీలించారు. మార్చి 16 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుతెన్నులను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని.. వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఇచ్చేందుకు కష్టపడి, ఇష్టపడి చదవాలన్నారు. బాగా చదువుకొని ఎదిగితే కుటుంబంతో పాటు గ్రామానికి మంచి పేరు వస్తుందన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఆ సర్టిఫికెట్ను తల్లిదండ్రుల చేతిలో పెట్టాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలనతో చదువుపై దృష్టి సారించాలని, పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలక మలుపన్న విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థుల ఉన్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు, ఇంటరాక్టివ్ సెషన్స్ వంటి వాటిని ఉపయోగించుకొని షైనింగ్ స్టార్స్గా ఎదగాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News