-ఆలయం వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూర్వకంగా ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం 2024లో పవన్ కళ్యాణ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంలో కొండగట్టు అంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. 35.19 కోట్ల అంచనా వ్యయంతో టి.టి.డి. సహకారంతో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలసి ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి తెలంగాణ దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యార్ ఆధ్వర్యంలో ఆలయ ఆర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్ ని సంప్రదాయబద్దంగా ఆలయంలోకి ఆహ్వానించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరువైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదం అందచేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్, ఈవో టి. శ్రీకాంతరావులు స్వామి వారి చితపటాన్ని బహూకరించారు.
పవన్ కళ్యాణ్ తోపాటు టీటీడీ బోర్డు మెంబర్ బి.ఆనందసాయి, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ సలహదారు గోవింద్ హరే, జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, ఆర్ కె సాగర్ తదితరులు ఆంజనేయస్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Prajavartha Online Telugu News