– రూ. కోటి ఖర్చుతో పీ4 కింద వెల్వడంలో రహదారి
– డా. లకిరెడ్డి హనిమిరెడ్డి సామాజిక సేవ
– ఈ సేవాతత్పరత పేదల కుటుంబాలకు కొత్త వెలుగు: కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2029 నాటికి పేదరికాన్ని పూర్తిగా దూరంచేసే గొప్ప లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్) కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపుతో బంగారు కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎందరో మార్గదర్శులుగా ముందుకొస్తున్నారు. సామాజిక సేవకు సై అంటూ పేద కుటుంబాల జీవన స్థితిగతులను మార్చే మౌలిక వసతుల కల్పనకు సైతం మరికొందరు కృచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో రూ.కోటితో డా. లకిరెడ్డి హనిమిరెడ్డి పీ4 కార్యక్రమం కింద 750 మీటర్ల పొడవైన సిమెంటు రహదారిని నిర్మింపజేశారు. వరవకట్ట నుంచి తోలుకొడు వెళ్లే రోడ్డు వరకు వేసిన ఈ రహదారిని గౌరవ స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. డా. లకిరెడ్డి హనిమిరెడ్డికి పీ4 ధ్రువీకరణపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ డా. లకిరెడ్డి హనిమిరెడ్డి కుటుంబం ఇప్పటికే గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, నాలుగు కిలోమీటర్ల మేర డ్రెయిన్ల ఏర్పాటుకు నిధులు వెచ్చించిందన్నారు. అదే విధంగా పాఠశాలలు, కళ్యాణమండపం, బస్ షెల్టర్, రెవెన్యూ భవన్.. ఇలా వివిధ నిర్మాణాలకు దాదాపు రూ. 20 కోట్లతో చేయూతనిచ్చి సేవాతత్పరతను చాటుకున్నారన్నారు. తాజాగా రూ.కోటి ఖర్చుతో మరో రహదారిని నిర్మింపజేసి పెద్ద మనసు చాటుకున్నారన్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ పారిశ్రామికవేత్తలు, ఎన్నారైలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు మరింత మంది ముందుకురావాలని కోరారు. కేవలం ఆర్థిక వనరులే కాదు.. బంగారు కుటుంబాల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్య అవసరాలు వంటివాటి విషయంలో మార్గదర్శులు వేసే ఓ చిన్న అడుగు పేద కుటుంబాలు ఎదిగేందుకు దోహదం చేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో లకిరెడ్డి జయప్రకాశ్రెడ్డి, సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News