– భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
– ప్రతి సెక్టార్కూ ప్రత్యేక అధికారుల బృందం
– నిబద్ధతతో విధులు నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేద్దాం
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్యాల అమరావతోత్సవం జరగనుందని, ఈ ఉత్సవాల్లో పర్యాటకులకే పెద్దపీట ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు.
మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కలెక్టర్ లక్ష్మీశ.. సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్, టీమ్వర్క్ (సెలబ్రేటింగ్ ది ఆర్ట్స్) సంస్థ ప్రతినిధి సయ్యద్ శామ్స్ తదితరులతో కలిసి ఆవకాయ్ అమరావతోత్సవానికి సంబంధించి సమన్వయ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో కార్యక్రమాల విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఉత్సవాల నిర్వహణలో విశేష అనుభవమున్న టీమ్వర్క్స్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అవకాయ్ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. పున్నమిఘాట్తో పాటు భవానీ ద్వీపంలో సినిమా, సంస్కృతి, సాహిత్యాలకు సంబంధించి వినూత్న కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. వీటిని దృష్టిలో ఉంచుకొని 20 సెక్టార్లకు సంబంధించి ఒక్కో సెక్టార్కు జిల్లా అధికారితో పాటు రెవెన్యూ, పోలీస్, వీఎంసీలకు చెందిన అధికారులు, సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేశామని.. ఎక్కడా ఎలాంటి పొరపాటుకు తావులేకుండా నిబద్ధతతో విధులు నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అగ్నిమాపక, విద్యుత్ శాఖలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్సవాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. వేదికల వద్ద కూడా స్పాట్ రిజిస్ట్రేషన్కు వీలుకల్పించినట్లు తెలిపారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు.
సాంకేతికత సహాయంతో: సీపీ రాజశేఖరబాబు
ఆధునిక సాంకేతికత సహాయంతో ఇప్పటికే దసరా ఉత్సవాలతో పాటు భవానీ దీక్షల విరమణ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని.. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆవకాయ్ ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశామని సీపీ ఎస్వీ రాజశేఖరబాబు అన్నారు. సీసీటీవీలు, డ్రోన్లు, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలను ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలు పర్యాటకులు మధురానుభూతులను సొంతం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఏపీటీఏ డిప్యూటీ సీఈవో ఎ.శ్రీనివాస్ మాట్లాడుతూ భవానీ ద్వీపంలో ఉత్సవాల నిర్వహణకు తొమ్మిది బోట్లు, నాలుగు జెట్టీలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ప్రణాళికాయుత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
సమావేశంలో విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా టూరిజం అధికారి ఎ.శిల్ప, ఏడీసీ డా. డి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News