-కొండపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రూ.10 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు
-రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశిననేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్
-కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్యను రైల్వే అధికారులకు వివరించిన ఎంపీ కేశినేని శివనాథ్
-రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి డ్రైన్ల పరిస్థితి పరిశీలన
-గొల్లపూడి లోని బల్బ్ లైన్ల పరిధిలో స్థలం పరిశీలన
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత భారత్ 2.0 కింద కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి అంగీకరించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో విజయవాడ రైల్వే స్టేషన్ కు ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ గా గొల్లపూడి లోని బల్బ్ లైన్ల స్టేషన్ ఉపయోగ పడే అంశాన్ని పరిశీలించాలని కోరటం జరిగిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది, కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ వెంట డ్రైన్ల సమస్య, గొల్లపూడి రైల్వే స్టేషన్ స్థల పరిశీలనకు సంబంధించి రైల్వే అధికారులతో కలిసి ఎంపీ కేశిననేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జాయింట్ ఇన్స్పెక్షన్ బుధవారం చేయటం జరిగింది.
ముందుగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్దికి సంబంధించి ప్లాట్ ఫారమ్ ఎత్తు పెంచటం, ఇతరత్రా సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన అంశాలను పరిశీలించిన అనంతరం, కొండపల్లి–విజయవాడ రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి డ్రైన్ల సమస్యను పరిశీలించారు. కొండపల్లి ఎస్టీ కాలనీ వద్ద రైల్వే ట్రాక్ కింద ఉన్న డ్రైనేజీలో ప్రతి ఏడాది వర్షాకాలం నీళ్లు సక్రమంగా పారుదల కాక అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులు రైల్వే అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వివరించారు. అలాగే గొల్లపూడి లోని బల్బ్ స్టేషన్ ను సందర్శించి అక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటుకు అనువుగా వున్న స్థలాన్ని రైల్వే అధికారులతో కలిసి పరిశీలించటం జరిగింది.
ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ రైల్వే స్టేషన్ కు గొల్లపూడి లోని బల్బ్ లైన్ల స్టేషన్ ప్రత్యామ్నాయ రైల్వే స్టేషన్ గా ఉపయోగపడుతుందన్నారు. బల్బ్ లైన్ల స్టేషన్ లో మూడు రైల్వే ట్రాక్స్ మధ్యలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 150 ఎకరాల స్థలం అనుకూలంగా వుందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఈ అంశం పై చర్చించగా….ఈ స్థలాన్ని రైల్వే అధికారులతో కలిసి పరిశీలించేందుకు రావటం జరిగిందన్నారు.
కొండపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది అంశంపై మాట్లాడటం జరిగిందన్నారు. కొండపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి, ఆధునికీకరణకు సంబంధించి రూ.10 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు అధికారులు రైల్వే శాఖకు పంపించినట్లు తెలిపారు. రాజధాని అమరావతికి ఉపయోగపడే విధంగా కొండపల్లి రైల్వే స్టేషన్ వుంటుందని, త్వరలోనే ఈ స్టేషన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయన్నారు.
ఇప్పటికే కొండపల్లి నుంచి గొల్లపూడి రైలు మార్గంలో వున్న ఎల్.సి నెంబర్ 147, 148 ఆర్వోబిలకు టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. ఎల్.సి నెంబర్ 140 కి ఆర్.యు.బి మంజూరు కాగా, ఎల్.సి.నెంబర్ 150కి మంజూరైన టూ లైన్ ఆర్.వో.బి ను 4 లైన్ ఆర్.వో.బి చేయాలని కోరటం జరిగిందన్నారు.
కొండపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలతో పాటు, ఈ రైల్వే ట్రాక్ ఏరియాలో కొండపల్లి మున్సిపాలిటీ ప్రజలు పడుతున్న ఇబ్బందులపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరిన మేరకు, ఇక్కడి సమస్యలను రైల్వే అధికారులకు స్వయంగా చూపించి, వివరించినట్లు ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అమృత్ భారత్ 2.0 పథకంలో భాగంగా కొండపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం రూ.10 కోట్ల మంజూరుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను ఎంపీ కేశినేని శివనాథ్ విజ్ఞప్తి చేశారన్నారు.కొండపల్లి వాసుల కల అయిన నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం త్వరలోనే సాకారం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) , మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , కొండపల్లి టిడిపి ప్రెసిడెంట్ బాలాజీ, గొల్లపూడి సీనియర్ నాయకులు వడ్లమూడి చలపతిరావు, జాలిపర్తి గోపాలకృష్ణా, రాయనపాడు నాయకులు కాటంనేని పూర్ణచంద్రరావు, శీలంనేని సాంబశివరావు లతో పాటు కొండపల్లి కౌన్సిలర్లు, ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News