– ఇంచార్జి జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై. మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ‘మీకోసం’ PGRS కార్యక్రమంతో పాటు, భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి జనవరి 12 (సోమవారం) ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లోని PGRS హాల్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు.
పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నందున, మండల స్థాయి ‘మీకోసం’కు తహశీల్దార్లు, ఆర్డీవోలు హాజరుకాగా, వారి స్థానంలో డిప్యూటీ తహశీల్దార్లు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు హాజరుకావాలని ఆదేశించారు. అధికారులు ల్యాప్టాప్లు, అవసరమైన రెవెన్యూ రికార్డులతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.
భూమి సమస్యలు, మ్యూటేషన్, రికార్డుల సవరణ, రీ-సర్వే అంశాలపై వచ్చిన వినతులను అక్కడికక్కడే పరిశీలించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా డివిజన్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు ‘మీకోసం’ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
ప్రజలు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని, అర్జీ స్థితిగతులను 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. అలాగే ‘మన మిత్రా’ వాట్సప్ గవర్నెన్స్ యాప్ ద్వారా 9552300009 నంబర్ ద్వారా 36 శాఖలకు చెందిన 700కు పైగా సేవలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ కోరారు.
Prajavartha Online Telugu News