– బెంగళూరు-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో గిన్నిస్ రికార్డులు గర్వకారణం
– రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారులు (ఎన్హెచ్) సమగ్ర ఆర్థిక వృద్ధికి జీవనాడులు అని, బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్ పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదు కావడం రాష్ట్రానికి, దేశానికి గర్వకారణమని, రికార్డుల సాధనలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు.
సత్యసాయి జిల్లాలో సోమవారం జరిగిన బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్కు సంబంధించి జాతీయ రహదారి పనుల్లో నాలుగు గిన్నిస్ రికార్డులు నమోదు కార్యక్రమానికి కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా హాజరుకాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్ నుంచి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు కూడా వర్చువల్గా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆర్థిక కారిడార్ పరిధిలో జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల ఆయా ప్రాంతాల్లో ఆర్థిక రంగం బలోపేతమవుతుందని, సత్వర రవాణా సేవలు ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధితో పరిశ్రమలకు ముడిసరుకు సరఫరా సులభతరమవుతుందని, ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలవుతుందన్నారు. ఇలా పారిశ్రామిక రంగం వృద్ధి చెందితే పెట్టుబడులు పెరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతమవుతాయన్నారు. గౌరవ ముఖ్యమంత్రి స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు మాట్లాడుతూ వినూత్న కార్యాచరణకు గుర్తింపుగా గిన్నిస్ రికార్డులు లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News