-దాదాపు రూ. 2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో గత పది రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించిన ‘ఖాదీ మహోత్సవం’ ప్రదర్శన నేటితో విజయవంతంగా ముగిసిందని, ప్రదర్శనకు నగర ప్రజల నుండి అనూహ్య స్పందన లభించడమే కాకుండా, విక్రయాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి లు తెలిపారు.
జనవరి 3వ తేదీన మేరిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రారంభమై గత పది రోజులుగా ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఖాదీ విక్రేతలు, చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను ప్రదర్శనల ద్వారా దాదాపు రూ. 2 కోట్ల 20 లక్షలకు పైగా అమ్మకాలు జరిగాయన్నారు.
ఈ ఏడాది ఖాదీ వస్త్రాలకు, హస్తకళా రూపాలకు ప్రజల నుండి భారీ ఆదరణ లభించిందని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగి, రికార్డు స్థాయి టర్నోవర్ను సాధించినట్లు తెలిపారు. స్వచ్ఛమైన ఖాదీ వస్త్రాలు, సిల్క్ చీరలు, రెడీమేడ్ దుస్తులతో పాటు చేతితో తయారు చేసిన గృహాలంకరణ వస్తువులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. పర్యావరణ హితమైన ఖాదీని ధరించడం ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా గ్రామీణ కార్మికులకు మనం అండగా నిలుస్తున్నామని, ఈ ప్రదర్శనను ఇంతటి ఘనవిజయం చేసిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నేటితో ఈ ప్రదర్శన ముగిసినప్పటికీ, ఖాదీ ఉత్పత్తుల పట్ల ప్రజల్లో పెరిగిన ఈ ఆసక్తి భవిష్యత్తులో మన నేతన్నలకు మరింత ఉపాధిని కల్పిస్తుందని డా. ఎస్. గ్రీప్, సహాయ సంచాలకులు ఆర్.ఎల్.ఎన్. మూర్తి లు ఆశాభావం వ్యక్తం చేశారు..
ముగింపు కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కే. ప్రియాంక, పరిశ్రమల శాఖ జిల్లా మనేజర్ ఎం. మధు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News