గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పశు పోషణ పట్ల మక్కువ కలిగిన ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశువుల పట్ల తనకున్న ఆప్యాయతను, పశు పోషకుల పట్ల అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఆదివారం జరిగిన గోవులు, దూడల అందాల పోటీల్లో విజేతలకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే యార్లగడ్డ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో యార్లగడ్డ మాట్లాడుతూ పశుపోషకులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కడప, కర్నూలు వంటి దూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఇక్కడికి వచ్చి పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించలేని వారిని ఉత్తి చేతులతో పంపించి నిరుత్సాహపరచటం తగదని వారికి ప్రోత్సాహకంగా బహుమతులు ఇవ్వటం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈమేరకు కడప, కర్నూల్ నుండి వచ్చిన రైతులకు రూ.10 వేలు నగదును బహుమతి గా తాను ఇస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ సభ ముఖంగా ప్రకటించారు. తన కార్యాలయం నుండి నగదు తీసుకుని పశుపోషకులకు ఫోన్ పే ద్వారా బదిలీ చేయాలని పోటీల నిర్వాహకులు కాసర్నెని రాజా, వెంకటనారాయణలను ఆదేశించారు. పశు పోషకులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే వెంకటరావును ఈ సందర్భంగా పలువురు అభినందించారు.
Prajavartha Online Telugu News