విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎం.హెచ్.పి.ఎస్ కేంద్ర కార్యాలయం వద్ద జనాబ్ మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి సంక్రాంతి సమైక్యతా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి అనేది తెలుగు ప్రజల పండగ, మన సంస్కృతి సంప్రదాయాలను తెలుగు ప్రజలైన మనమందరం కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎం.హెచ్.పి.ఎస్ కేంద్ర కార్యాలయం నందు నిర్వహించిన కార్యక్రమంలో అనేకమంది సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తెలుగువారి తెలుగుదనాన్ని తెలియపరిచే విధంగా చెరుకు గడలతో, బ్రహ్మాండమైన తోరణాలతో, గంగిరెద్దులతో, హరిదాసులతో కీర్తనలతో పాటుగా ముగ్గుల పోటీలు, కోలాటం, మరియు చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. 30కేజీల కేక్ కట్ చేస్తూ ఆరంభించిన సంబరాల్లో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందినవారికి బహుమతులను అందచేశారు. శాఖాహార విందుతో సంక్రాంతి సమైక్యతా సంబరాలను ఘనంగా ముగించారు.
ఈ సంబరాలను ఉద్దేశిస్తూ ఫారూఖ్ షిబ్లి మాట్లాడుతూ తెలుగు వారి పండుగ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పండుగ సంక్రాంతి. దేశానికి వెన్నుముకగా నిలిచే రైతన్నల చేతికి పంట అందే సమయం సంక్రాంతి. శీతాకాలానికి గౌరవంగా వీడ్కోలు పలుకుతూ వసంతానికి స్వాగతం పలికేది సంక్రాంతి. సంక్రాంతి ఒక కులానికి లేదా ఒక మతానికి చెందిన పండుగ కాదు ఇది మన తెలుగు వారి పండుగ. రాను రాను కనుమరుగవుతున్న మన తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News