–జిల్లా రవాణా శాఖ సంయుక్త కమిషనర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో, ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టిందని జిల్లా రవాణా శాఖ సంయుక్త కమిషనర్ తెలిపారు.
* గత ఐదు రోజులుగా RTGS పర్యవేక్షణతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Fare Monitoring Teams ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫార్ములు (అభి బస్, రెడ్ బస్ తదితర యాప్లు) లోని బస్సు ఛార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.
* అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రైవేట్ బస్సు యజమానులతో అధికారులు సమన్వయం చేసి, ఛార్జీలను తక్షణమే తగ్గించి నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
* RTC నిర్దేశించిన ఛార్జీలపై గరిష్టంగా 50 శాతం మాత్రమే అదనంగా వసూలు చేయాలని స్పష్టం చేస్తూ, దానికంటే ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
* ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా 24×7 హెల్ప్లైన్ నెంబర్ – 92816 07001 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్సు ఛార్జీలు లేదా ఇతర సమస్యలపై ఫిర్యాదులు అందిన వెంటనే అధికారులు స్పందించి తక్షణ పరిష్కారం అందిస్తారని చెప్పారు.
* ఈ హెల్ప్లైన్ నెంబర్ను ప్రతి ప్రైవేట్ బస్సులో తప్పనిసరిగా స్పష్టంగా ప్రదర్శించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
* అదే విధంగా మోటార్ వాహన తనిఖీ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు.
* గత ఐదు రోజులగా జరుగుతున్న ఈ తనిఖీలలో అధిక ఛార్జీలు వసూలు చేసిన 2 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 20,000/- జరిమానా విధించామని, అలాగే పన్ను, పర్మిట్ వంటి ఇతర నిబంధనలు ఉల్లంఘించిన 92 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 3,43,650/- జరిమానా విధించినట్లు తెలిపారు.
* ఈ ప్రత్యేక తనిఖీలు మరియు పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని, పండుగ అనంతరం తిరుగు ప్రయాణాల సమయంలో కూడా ఇదే విధమైన కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు భద్రతతో కూడిన ప్రయాణం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పండుగ కాలంలో ప్రయాణికుల శ్రేయస్సు కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని NTR జిల్లా రవాణా శాఖ సంయుక్త కమిషనర్ ఎ . మోహన్ ఈ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News