Breaking News

పిపిపిపై రాష్ట్రానికి కేంద్రం మ‌రో లేఖ‌

-వైద్య సేవ‌ల డిమాండ్‌, ల‌భ్య‌త‌ల మ‌ధ్య తేడాను పిపిపి ద్వారా పూరించండి
-5 ర‌కాల సేవ‌ల్ని విస్త‌రించ‌డానికి సూచ‌న‌లు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య‌, ఆరోగ్య సేవ‌ల్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత విస్తృత స్థాయిలో అందించ‌డానికి పిపిపి విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. ఈ మేర‌కు పిపిపి మోడ‌ల్‌ను అనుస‌రించ‌డంపై వివ‌ర‌ణాత్మ‌క‌మైన లేఖ‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి విజ‌య్ నెహ్రా ఈనెల 12న లేఖ రాశారు. లేఖ‌తో పాటు వివిధ సేవ‌లను గ‌రిష్ట స్థాయిలో పిపిపి ద్వారా అందించ‌డానికి 27 పేజీల‌తో కూడిన మార్గ‌దర్శ‌కాల‌ను వివ‌రించారు.

వైద్య విద్యను విస్త‌రించ‌డానికి పిపిపి అత్యంత అనుకూల సాధ‌నమ‌ని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జె.పి.న‌డ్డా రాష్ట్రానికి ఇటీవ‌ల రాసిన లేఖ‌ను ప్ర‌స్తావించారు. దానికి అనుబంధంగా రెండ‌వ లేఖ‌ను రాస్తున్న‌ట్లు కేంద్ర అధికారి నెహ్రా తెలిపారు.

కేంద్రం సూచ‌న‌లు

వైద్య సేవ‌ల డిమాండ్‌, ల‌భ్య‌త‌ల మ‌ధ్య ఉన్న వ్య‌త్యాసాన్ని పూరించ‌డానికి 5 అంశాల‌కు సంబంధించి పిపిపి విధానాన్ని అమ‌లు చేయ‌డంపై కేంద్ర ఆరోగ్య శాఖ ప‌లు అంశాలకు సంబంధించి సూచ‌న‌లు చేసింది.

న్యూక్లియ‌ర్ మెడిసిన్‌, సంచార వైద్య శాల‌లు(Mobile Medical Units-MMUs), దంత వైద్య శాల‌లు, రేడియాల‌జీ సేవ‌లు మ‌రియు క్యాన్స‌ర్ డే కేర్ సెంట‌ర్లను విస్త‌రించ‌డానికి పిపిపి విధానాన్ని అవ‌లంబించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.

ఎక్విప్‌, ఆప‌రేట్‌, మెయింటైన్‌ (Equip Operate Maintain-EOM) మ‌రియు ఆప‌రేట్ అండ్ మెయింటైన్‌(O and M) మార్గాల ద్వారా పిపిపి విధానంలో సేవ‌ల ల‌భ్య‌త‌ను పెంచాలని కేంద్రం సూచించింది. 5 నుండి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ప్రైవేట్ భాగ‌స్వామి ఆయా సేవ‌లందించ‌డానికి అనుస‌రించాల్సిన చెల్లింపు విధానంపై కూడా కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సూచించింది.

క్యాన్స‌ర్, కార్డియో వాస్కుల‌ర్ మ‌రియు న‌రాల వ్యాధుల‌కు ఉత్త‌మ‌మైన సేవ‌ల్ని న్యూక్లియ‌ర్ మెడిసిన్ ద్వారా రోగుల‌కు అందించ‌వ‌చ్చ‌ని, ఈ సేవ‌ల ల‌భ్య‌త ప్ర‌స్తుత అవ‌స‌రాల మేర‌కు, ముఖ్యంగా మ‌ధ్య‌, చిన్న స్థాయి న‌గ‌రాల్లో బాగా త‌క్కువ‌గా ఉన్నాయ‌ని, పిపిపి విధానంలో ఈ సేవ‌ల్ని విస్త‌రించడానికి త‌గు చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల‌ని కేంద్రం సూచించింది. క్యాన్స‌ర్ వ్యాధి అతి శీఘ్రంగా విస్త‌రిస్తున్నందున స‌త్వ‌ర‌మే ఈ దిశ‌గా చ‌ర్య‌ల్ని చేప‌ట్టాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. పెట్‌-సి.టి, స్పెక్ట్ ఇమేజింగ్‌, రేడియో థెర‌పీ సేవ‌ల్ని గ్రామాణ మ‌రియు సెమీఅర్బ‌న్ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది.

60 శాతం నుండి 90 శాతం వ‌ర‌కు వివిధ వ‌యస్కులు దంత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నా అవ‌స‌రాల మేర‌కు వైద్య సేవ‌లు ల‌భించ‌డంలేద‌ని కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(Community Health Centers_CHCs) దంత వైద్య ప‌రిక‌రాలు, వైద్యుల ల‌భ్య‌త త‌గు స్థాయిలో లేవ‌ని, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లో (Primary Health Centers-PHCs) పిపిపి ద్వారా దంత వైద్య సేవ‌ల్ని ప‌టిష్టం చేయాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది.

వ్యాధి నిర్ధార‌ణ‌లో ఎంత‌గానో ఉప‌క‌రించే ఎక్స్‌రే, సి.టి, ఎంఆర్ఐ యంత్రాల ల‌భ్య‌త‌ను విస్తృతం చేయాల‌ని, అందుకు పిపిపి విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని కేంద్రం తెలిపింది.

క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారిపై యుద్ధంలో భాగంగా ముంద‌స్తు స్క్రీనింగ్ మ‌రియు వ్యాధి నిర్ధార‌ణ క‌సం క్యాన్స‌ర్ డేకేర్ సెంట‌ర్ల ఏర్పాటుకు కూడా పిపిపి అనువైన విధాన‌మ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 2027-28 లోగా దేశ వ్యాప్తంగా అన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో డే కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేయాల‌న్న‌దే కేంద్రం ల‌క్ష్య‌మ‌ని, ఈ దిశ‌గా 2025-26 సంవ‌త్స‌రానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు 14 సెంట‌ర్ల మంజూరు చేశామ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ‌లో పేర్కొంది.

ఈ లేఖ వివ‌రాల‌ను కార్య‌ద‌ర్శి సౌర‌భ్ గౌర్ వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ దృష్టికి తీసుకొచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *