అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రయాణికులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకున్న Andhra Pradesh State Road Transport Corporation (ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.)తాజాగా మరో గౌరవప్రదమైన జాతీయ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 2025 సంవత్సరానికి గాను “గవర్నెన్స్ నౌ – 6వ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సమ్మిట్స్&అవార్డ్స్”కార్యక్రమంలోఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్అమలుకు గాను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.
వివిధ ప్రాంతాలు, భాషలకు చెందిన ప్రయాణికులు నిత్యం అనేక అవసరాలు, పనుల నిమిత్తం బస్ స్టేషన్లను ఆశ్రయిస్తుంటారు. అటువంటి ప్రయాణికులకు బస్సుల రాకపోకల వివరాలు, ప్లాట్ఫాం నంబర్, రూట్ సమాచారం తదితర కీలక వివరాలను స్పష్టంగా, సమయానుకూలంగా తెలియజేయాలనే లక్ష్యంతో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. తన ప్రధాన బస్ స్టేషన్లలో ఆటోమేటిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ను అమలు చేస్తోంది.
ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా ప్రయాణికులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా అవసరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం కలుగుతోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని ప్రధానంగా తీసుకుని డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ఈ గౌరవప్రదమైన అవార్డును సాధించింది. ప్రయాణికుల సేవల్లో డిజిటలైజేషన్ను విజయవంతంగా అమలు చేస్తున్న సంస్థగా ఇది మరో గుర్తింపుగా నిలిచింది.
ఈ సందర్భంగా ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.చీఫ్ ఇంజినీర్ (ఐ.టి.) వై. శ్రీనివాసరావు, ‘గవర్నన్స్ నౌ’ మేనేజింగ్ డైరెక్టర్ కైలాస్నాథ్ అధికారిచేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.
ఈ అవార్డు లభించినందుకు సంస్థ వైస్ చైర్మన్&మేనేజింగ్ డైరెక్టర్సీహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్.హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, ఉద్యోగులు అందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Prajavartha Online Telugu News