– ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, అలాగే CCLA & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జారీ చేసిన సూచనల మేరకు, PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్)లో ముఖ్యంగా భూమి సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ – PGRSకు ఏర్పాట్లు చేసినట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్లోని ప్రత్యేక హాల్లో రెవెన్యూ అధికారుల సమక్షంలో ఈ రెవెన్యూ క్లినిక్ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం (PGRS)’ కార్యక్రమంతో పాటు ఈ రెవెన్యూ క్లినిక్ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లు, రాజమహేంద్రవరం మరియు కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులు సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు ల్యాప్టాప్, కంప్యూటర్ ఆపరేటర్ మరియు అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టాదారు పాసు పుస్తకాలలో నమోదైన తప్పులను సరిదిద్దేందుకు కలెక్టరేట్ లో మండలాలు వారీగా ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని ఆయా రెవెన్యూ అధికారుల సమక్షంలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
PGRS యథావిధిగా నిర్వహణ
‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ నుంచి డివిజన్, మండల, మున్సిపల్, గ్రామ, వార్డు సచివాలయాల వరకు యథావిధిగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా మండల స్థాయిల్లో సంబంధిత డిప్యూటీ తహశీల్దార్ / రీ-సర్వే డిప్యూటీ తహశీల్దార్లు PGRS కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు. ప్రజలు తమ వినతులను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, నమోదు చేసిన అర్జీల స్థితిగతులపై సమాచారం కోసం 1100 టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
9552300009 వాట్సప్ గవర్నెన్స్
వాట్సప్ గవర్నెన్స్ – ‘మన మిత్రా’ యాప్ ద్వారా పౌర సేవలు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందించేందుకు 9552300009 వాట్సప్ గవర్నెన్స్ ‘మన మిత్రా’ యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన పౌర సేవలు అందుబాటులో ఉన్నాయని మేఘా స్వరూప్ తెలిపారు. ప్రజలు ఈ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News