-వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఘన నివాళులు
– ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 18న యోగి వేమన జయంతిని పురస్కరించుకుని సోమవారం రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్లో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ (ఎఫ్ఏసీ) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పాల్గొని వేమన సందేశాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేమన పద్యాలు తెలుగు ప్రజల జీవితంలో ఒక భాగమని, అవి సులభంగా అర్థమయ్యేలా ఉండటంతో నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే వేమన బోధనలు కాలాతీతంగా నిలిచిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా యోగి వేమన పద్యాన్ని పలువురు విద్యార్థులు ఆలపించడం జరిగింది. మన ఆలోచనలు మంచిగా ఉంటే, మన కార్యాచరణ కూడా మంచిగా ఉంటుందని, నిజాయితీతో పనిచేస్తే మంచి ఫలితాలు తప్పక లభిస్తాయని వేమన బోధనలు వివరించారు. ఇది ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ అనుసరణీయమైన బోధన అని తెలిపారు. యోగి వేమన గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సీపీ బ్రౌన్ సేవలు మరువలేనివని, మన భాష, సంస్కృతి విలువలను ప్రపంచం గుర్తించడం గర్వకారణమని ఇంచార్జి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వేమన పద్యాలు, సూక్తులు భావితరాలకు చేరేలా చూడటం మన అందరి బాధ్యత అని, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు వేమన బోధనలను తమ ఉద్యోగ బాధ్యతల్లో అమలు చేయాలని సూచించారు. నిజాయితీతో విధులు నిర్వహించడం, ప్రజల పట్ల సేవాభావంతో పని చేయడమే వేమనకు అర్పించే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ పి. శ్రీనివాస్ రావు, సత్యసాయి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురువా రెడ్డి, పాఠశాల విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News