-ఇందుకోసo ప్రస్తుత సేవల నాణ్యతపై జిల్లాల్లో అధ్యయనం కోసం చర్యలు
-ప్రత్యేకంగా ముగ్గురు వైద్యులతో పరిశీలక బృందాల ఏర్పాటు
-రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాతా, శిశు మరణాల్ని తగ్గించేందుకు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘కార్యాచరణ ప్రణాళిక’ ను రూపొందిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మాతా, పుట్టిన ఏడాది లోపు శిశు మరణాలకు దారితీస్తున్న కారణాలు, వైద్యులు, సిబ్బంది అనుసరిస్తున్న విధానాల్లో ఉన్న చిన్న లోపాలు సైతం గుర్తించి వాటిని పునరావృతం కాకుండా చూసేలా తగిన సలహాలు, సూచనలతో ‘కార్యాచరణ ప్రణాళిక ‘ను అధికారులు సిద్ధం చేస్తారన్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ముగ్గురు వైద్యులతో పరిశీలక బృందాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 19 మంది మృతి
శిశువుల్లో ప్రతి వెయ్యి మందిలో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మందిలో 25 మంది ప్రాణాలు విడుస్తున్నారు. దీంతో పోల్చితే రాష్ట్రంలో శిశు మరణాలు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో ప్రాణాలు విడుస్తున్న 19 మందిలో 16 మంది పుట్టిన 28 రోజుల్లోపు కన్ను మూస్తున్నారు. ఇదే విధంగా జాతీయ స్థాయిలో పరిశీలించినట్లయితే ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
28 రోజుల్లో జరిగే మరణాలపై స్పెషల్ ఫోకస్
రకరకాల కారణాలతో
ప్రసవం ముందు, ఆ తర్వాత కొందరు, కొన్ని రోజులు గడిచిన అనంతరం ఇంకొందరు శిశువులు ప్రాణాలు విడుస్తున్నారు. ఏడాది లోపు వయసు కలిగి జరిగే శిశు మరణాల్లో… పుట్టిన 28 రోజుల్లో జరిగే నవజాత శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిపై కూడా రాష్ట్రoలో స్టడీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన రిపోర్టింగ్ సిస్టంలో మార్పు జరిగేలా యాక్షన్ ప్లాన్లో ప్రతిపాదించనున్నారు.
యునిసెఫ్, డబ్ల్యూహెచ్ ఓ సహకారం
నవజాత శిశు మరణాలను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో గర్భిణిలు,మాతా, నవజాత శిశువులకు అందుతున్న వైద్యం, ప్రసవ సమయంలో అనుసరిస్తున్న విధానాల్లో లోపాలను (గ్యాప్ అసెస్మెంట్) గుర్తిస్తున్నారు. యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహకారంతో క్షేత్ర స్థాయిలో వైద్య సేవలు, ఇతర అంశాలను ఎలా పరిశీలించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం పంపించిన ‘ఇండియా న్యూబార్న్ యాక్షన్ ప్లాన్’ ఫ్రేమ్ వర్క్ ను అధికారులు అనుసరిస్తున్నారు
ప్రభుత్వాసుపత్రుల సందర్శన
ఈ క్రమంలో జిల్లాల వారీగా ముగ్గురు సీనియర్ వైద్యులతో ప్రత్యేక పరిశీలక బృందాలను వైద్య ఆరోగ్య శాఖ నియమించింది. ఈ బృందంలో చిన్న పిల్లల వైద్యులు, గైనకాలజిస్టు, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వైద్యులు ఉన్నారు. ఈ బృందాలు సదరు జిల్లాల్లోని అన్ని రకాల ప్రభుత్వాసుపత్రులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సందర్శించి. గర్భణిలకు అందుతున్న వైద్య సేవలు, ఐదేళ్లలోపు వయసు కలిగిన చిన్నారుల వరకు వివిధ దశల్లో అందుతున్న వైద్య సేవల గురించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తాయి. నవజాత శిశు మరణాల వివరాలు కూడా సేకరిస్తారు. అదేవిధంగా గర్భిణిలు, తల్లుల నుంచి కూడా వారికి అందుతున్న క్లినికల్ కేర్ కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటాయి. వీటి ఆధారంగా ప్రతి జిల్లా నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయానికి “యథాస్థితి ” నివేదికలు అందుతాయని, వీటిని
క్రోడికరించి ‘రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక’ ను రూపొందిస్తామని మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ వివరించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ లో కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామన్నారు.
పరిశీలక బృందాలకు ప్రత్యేక కార్యశాల
రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాoడియన్ ఆదేశాల మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా జిల్లాల్లో ఏ విధంగా సమాచారాన్ని సేకరించాలన్న దానిపై పరిశీలక బందాల్లోని సభ్యులకు విజయవాడలో ప్రత్యేకంగా కార్యశాల (సదస్సు)ను బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ అనిల్ కుమార్ (మెటర్నల్ చైల్డ్ హెల్త్), సంయుక్త సంచాలకులు డాక్టర్ ఎల్బీఎస్ హెచ్ దేవి మాట్లాడుతూ మాతా శిశు మరణాల తగ్గింపునకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ ఇంకా దృష్టిపెట్టాల్సిన అంశాలపై పరిశీలక బృందాలకు అవగాహన కల్పించారు. అలాగే యునిసెఫ్ ముఖ్య ప్రతినిధులు, వైద్యులు శ్రీధర్, సలీమా (హెల్త్ స్పెషలిస్టులు), నాగేంద్ర (ఎంసీహెచ్ కన్సల్టెంటెంట్), డబ్ల్యూహెచ్ ఓ ఢిల్లీ ప్రతినిధులు డాక్టర్ దీపాంకర్, వికాస్ మాట్లాడుతూ ఇండియా న్యూబార్న్ యాక్షన్ ప్లాన్ ఆధారంగా మాతా, నవజాత శిశు ఆరోగ్యoపై స్టడీ ఎలా జరగాలన్న దానిపై కూలంకుషంగా వివరించారు. దీనికి అనుగుణంగా తయారయ్యే ప్రణాళిక భవిష్యత్తు తరాలకు ఓ దిక్సూచిగా ఉంటుందని అధికారులు వివరించారు.
Prajavartha Online Telugu News