అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ 2026 వేడుకల్లో ఏపీఎస్డీఎంఏ అధికారుల ఎంపికతో జాతీయ విపత్తు సన్నద్ధత రంగంలో ఏపీఎస్డీఎంఏ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ)లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారి,ఆపద మిత్ర వాలంటీర్లలో ఒకరు న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్ను వీక్షించడానికి ఎంపికయ్యారని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
విపత్తు ప్రమాదాల తగ్గింపు, సమాజ ఆధారిత సన్నద్ధత, విపత్తులు ఎదుర్కునే సామర్థ్యల నిర్మాణంలో మరియు ఆపద మిత్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో విశిష్ట సేవలకు గుర్తింపుగా, ఏపీఎస్డీఎంఏ కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ (సీబీఓ) రామాయణపు తనూజ, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆపద మిత్ర వాలంటీర్ పిట్టా స్వాతి ఈ గౌరవానికి ఎంపికయ్యారన్నారు. దేశ ప్రథమ పౌరురాలు, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక అతిథులతో నిర్వహించే సమావేశాల్లో వీరు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న వీరు శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NDMA) మెంబెర్ డాక్టర్ దినేష్ కుమార్ అస్వాల్, ఎన్డీఆర్ఎఫ్, డిఐజి డాక్టర్ హరి ఓం గాంధీతో ఇంటరాక్షన్ సమావేశంలో పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఏపీఎస్డీఎంఏ కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ మాట్లాడుతూ ఈ ఎంపిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాంలో సమాజ ఆధారిత విపత్తు ప్రతిస్పందన వ్యవస్థలను నిర్మించడంలో ఏపీఎస్డీఎంఏ చేస్తున్న దీర్ఘకాలిక ప్రయత్నాలకు ఇది బలమైన గుర్తింపన్నారు. ఆపదమిత్ర కార్యక్రమం, ముఖ్యంగా రాష్ట్రంలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాలలో క్షేత్రస్థాయి వరకు సన్నద్ధతను,వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాన్ని గణనీయంగా పెంచిందని ఆమె తెలిపారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది ప్రత్యేక అతిథులతో పాటు తమకు ఆహ్వానం అందడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళా ఉద్యోగులకు ఈ గుర్తింపు మరింత గొప్ప స్ఫూర్తినిస్తుందన్నారు.దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించే అరుదైన అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తపరిచారు.
విశాఖపట్నం నుండి ఆపద మిత్ర వాలంటీర్ అయిన శ్రీమతి పిట్టా స్వాతి తన కృతజ్ఞతను తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గొప్ప గౌరవమని అన్నారు. ఈ గుర్తింపు ఆపద మిత్ర వాలంటీర్లను విపత్తులు, అత్యవసర పరిస్థితులలో ఎక్కువ అంకితభావంతో కమ్యూనిటీల్లో సేవ చేయడానికి మరింత ప్రేరేపిస్తుందని తెలిపింది. జాతీయ స్థాయిలో మొత్తం 36 మంది నోడల్ అధికారులు, 150 మంది ఆపద మిత్ర వాలంటీర్లు న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఎంపికైన విపత్తుల సంస్థ ప్రతినిధులను APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్ వారిని అభినందించారు.
Prajavartha Online Telugu News