మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల అవార్డు అందుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తమ జిల్లా కలెక్టర్ అవార్డును స్వీకరించారు. 2002 ఓటర్ల జాబితా ను 2025 ఓటర్ల జాబితాతో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమం లో అత్యధికంగా మ్యాపింగ్ చేసినందుకు ఉత్తమ జిల్లా కలెక్టర్గా డీకే బాలాజీకి అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ఇది సాధ్యమైందని, ఇందుకు కృషిచేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, పూర్వపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News