అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని ఏపిసిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్., అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐ.ఏ.ఎస్. పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కమిషనర్ జెండా ఆవిష్కరించి, మన రాజ్యాంగం, అది నేర్పిన విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని నడుచుకోవాలని, రాజ్యాంగ స్పూర్తితో విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు ఉద్యోగులుగా గర్వించాలన్నారు. ఈ బృహత్తర నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ సూచనల మేరకు రాజధాని అమరావతిలో వేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. APCRDA ఆధ్వర్యంలో బహుముఖ అభివృద్ధికి కేంద్రంగా మన ప్రజారాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని, అమరావతిని వివిధ రంగాలలో పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. సిఆర్డిఏ ఆఫీసులోని అన్ని విభాగాల్లోనూ ప్రతిభ కనబర్చిన పలువురు ఉద్యోగులకు కమిషనర్, అడిషనల్ కమిషనర్ ప్రశంసా పత్రాలు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్డిఏ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సహాయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News