అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో మన దేశంలో అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ అయిన NIACL..తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించనుంది. ఈ కార్యాలయ స్థాపన ద్వారా NIACL..అమరావతిలో సుమారు రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టడమే కాక..అమరావతిలో టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి విభాగాల్లో 200 నుంచి 225 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అలాగే ఆధునిక అవసరాలకు అనుగుణంగా కొత్త ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అభివృద్ధి చేయడానికి ఏఐ స్పెషలిస్ట్ అధికారులను కూడా ఈ కార్యాలయంలో నియమించనున్నట్లు NIACL వర్గాలు పేర్కొన్నాయి. గ్రామీణ, పట్టణ, కార్పొరేట్ రంగాలతో పాటు సాధారణ ప్రజలకు అవసరమైన అన్ని రకాల నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ సేవలను అమరావతిలోని ప్రాంతీయ కార్యాలయం ద్వారా అందిస్తామని NIACL వర్గాలు వెల్లడించాయి. రైతులు, స్వయం సహాయక సంఘాలు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలకు ఇన్సూరెన్స్ సేవలు అందించి వారి ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేయడం ఈ ప్రయత్నం ఉద్దేశ్యం. ఈ మేరకు అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ స్థాపనకై ఏపీ సిఆర్డిఏతో NIACL ప్రతినిధులు 2026 జనవరి 28న అధికారికంగా ఒప్పందం చేసుకున్నారు. సిఆర్డిఏ తరఫున ఎస్టేట్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ వి. డేవిడ్ రాజు, NIACL తరఫున చీఫ్ రీజినల్ మేనేజర్ వి. రాజాకు ఈ మేరకు ఒప్పంద పత్రాలు అందజేశారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ సి.హెచ్. రాంబాబు ఈ ప్రక్రియను నిర్వహించారు. NIACL తరపున జి. అప్పల రాజు, అజీజ్ షేక్, వి. బసివి రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Prajavartha Online Telugu News