-భవిష్యత్తు విద్యుత్ అవసరాలను అందుకోవాలి
-డిమాండ్ కు తగిన విధంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగాలి
-ట్రాన్స్ కో ప్రాజెక్టుల సమీక్షలో మంత్రి గొట్టిపాటి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రాన్స్ కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.6 వేల కోట్లతో చేపట్టిన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోపు పూర్తి చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్న ట్రాన్స్ కో ప్రాజెక్టుల పురోగతిపై సచివాలయంలో గురువారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధ్యక్షతన జరిగి ఈ సమీక్ష సమావేశంలో సీఎస్ విజయానంద్, టాన్స్ కో జేఎండీ సూర్య సాయి ప్రవీణ్ చంద్ పాల్గొన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ట్రాన్స్ కో ప్రాజెక్టుల వివరాలను అధికారులను మంత్రి గొట్టిపాటి అడిగి తెలుసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభించి పెండింగ్ లో ఉన్న వాటి వివరాలను కూడా అధికారులు మంత్రికి తెలిపారు. పాత ప్రాజెక్టులతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను అన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అందుకునే విధంగా ప్రాజెక్టులన్నీ నిర్ణీత కాల వ్యవధిలో కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ వినియోగం, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. సీఆర్డీఏ పరిధిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఆ పనులను కూడా శాకాధికారులతో సమన్వయం చేసుకుని విద్యుత్ శాఖ అధికారులు ముందుకు సాగాలన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉత్తమ స్థాయిలో టాన్స్ మిషన్ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక సబ్ స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొచ్చామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు. ప్రజలు, రైతులతో పాటు వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో పని చేయాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి దిశా నిర్దేశం చేశారు. మరో రెండు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 ట్రాన్స్ కో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ట్రాన్స్ కో కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News