-ప్రభుత్వ సలహాదారు మంతెన సత్యనారాయణ రాజు
-ఆరోగ్యాలయాన్ని సందర్శించిన వైద్యాధికారులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించేలా చర్యలు తీసుకోవాలని యోగా- నేచురోపతి రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మంతెన సత్యనారాయణ రాజు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అమరావతిలో కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయాన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి, ఇతర అధికారులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మంతెన సత్యనారాయణ రాజు వారితో జరిగిన సమావేశంలో ‘యోగా- నేచురోపతి ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ’ అంశంపై మాట్లాడారు. ప్రతిరోజూ 30 నిమిషాల యోగాభ్యాసం, 15 నిమిషాల ధ్యానం చేయడాన్ని పిల్లలకు జరిగే బోధన వేళల పట్టికలో చేర్చాలని సూచించారు. తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మిల్లెటు ఆధారిత, ప్రొటీన్ సమృద్ధి ఆహారంతో ‘ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించవచ్చునని తెలిపారు. యోగా నేచురోపతిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని అధికారులకు మంతెన సత్యనారాయణరాజు హామీ ఇచ్చారు. ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, అవగాహన, మౌలిక వసతుల కల్పన, విధానపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి మంతెన సత్యనారాయణ రాజు అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆరోగ్యాలయం వాతావరణం, కార్యకలాపాల తీరు పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు.
Prajavartha Online Telugu News